ఒత్తిడి తెస్తున్నారు..వదలను: జియాఖాన్ తల్లి

మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తల్లి రబియా, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. ప్రస్తుతం సూరజ్పై కేసును ఉపసంహరించుకోవాలని పలువురు బాలీవుడ్ ప్రముఖులు కోరుతున్నట్లు రబియా పేర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదును ఉపసంహరించుకోనని ఆమె స్పష్టం చేశారు. వీరంతా సూరజ్ అమాయకుడని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
జియాఖాన్ అబార్షన్ చేసుకున్న ఆస్పత్రి నుంచి వైద్య నివేదికను పొందినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు. జియా గర్భం దాల్చడం, అబార్షన్ చేసుకున్న విషయం సూరజ్తోపాటు ఆమె చెల్లెళ్లు కరిష్మా, కవితకు తెలుసునని వివరించారు. ఈ సమాచారం ఆధారంగా కరిష్మా వాంగ్మూలం నమోదు చేశారు.
గర్భస్రావం విషయమై జియా, సూరజ్ కలుసుకున్న వైద్యుడి నుంచి ప్రాథమిక సమాచారం సేకరించారు. జియా రాసినట్లు భావిస్తున్న ఆరు పేజీల ఉత్తరం, సూరజ్ నివాసంలో స్వాధీనం చేసుకున్న అయిదు ప్రేమ లేఖల్లోని చేతిరాతను సరిపోల్చేందుకు నిపుణుడిని పోలీసులు పిలిపించారు.
గత ఏడాది కాలంలో ఈ ప్రేమికుల జంట ఖండాలా, లోనావాలా, గోవా సందర్శించినట్లు పోలీసులు వెల్లడించారు. ఎనిమిది నెలల కిందట గోవా వెళ్లినప్పుడు ఇరువురి మధ్య వివాదం తలెత్తి జియాపై చేయిచేసుకున్నట్లు సూరజ్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత జియా చేతి మణికట్ల వద్ద కోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు వివరించారు.
జియాఖాన్ను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఆమె ప్రియుడు సూరజ్ పంచోలిని ఈ నెల 27 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఈమేరకు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సీమా జాదవ్ గురువారం ఆదేశించారు.


Click it and Unblock the Notifications











