సీఎం జగన్తో చిరంజీవి లంచ్ మీటింగ్: టికెట్ రేట్లే కాదు.. వాటి గురించి చర్చించే అవకాశం
కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదం అవుతోన్న అంశాల్లో సినిమా టికెట్ రేట్ల అంశం ఒకటి. సామాన్యులకు వినోదాన్ని తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలను భారీగా తగ్గించేసింది. దీనివల్ల ఏపీలో విడుదల అవుతోన్న సినిమాలకు మంచి కలెక్షన్లు రావడం లేదు. అదే సమయంలో థియేటర్ యాజమాన్యాలకు కరెంట్ బిల్లులకు సరిపోను ఆదాయం రావడం కూడా గగనం అయిపోయింది. దీంతో ఈ వివాదం రోజు రోజుకూ పెరుగుతూనే వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. ఆ వివరాలు మీకోసం!

దాని కోసం ప్రభుత్వం జీవో జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలను కొన్ని థియేటర్లు దోచుకుంటున్నాయని, ప్రతి ఒక్కరికీ వినోదాన్ని తక్కువ ధరలకే అందించాలనే లక్ష్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ జీవో నెంబర్ 35ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. రాష్ట్రంలోని థియేటర్లలో ఏరియాను బట్టి రేట్లను నిర్ణయించారు. ఆ ధరలకే టికెట్లు అమ్మాలని కఠినంగా పేర్కొన్నారు.

కోర్టులో పిటీషన్.. పర్మీషన్ కోసం
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల రేట్లు తగ్గిసూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 35ను సవాల్ చేస్తూ పలు థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిటీషనర్లకు వెసలుబాటు కల్పించిన న్యాయస్థానం.. రేట్ల పెంపునకు జాయింట్ కలెక్టర్ల అనుమతి తీసుకోవాలని సూచించింది. అలా తీసుకోని థియేటర్లపై దాడులు చేస్తూ సీజ్ చేస్తున్నారు అధికారులు.

ఆ థియేటర్లకు ఉపశమనం ఇచ్చి
ఏపీలోని పలు ప్రాంతాల్లో అధికారులు సీజ్ చేసిన 83 థియేటర్లను పున: ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, నాలుగు వారాల్లోగా ఆ థియేటర్ల యాజామాన్యాలు లైసెన్సులు రెన్యూవల్ చేసుకోవాలని సూచించింది. ఆ గడువు తీరిన తర్వాత మరోసారి థియేటర్లపై దాడులు జరిగే అవకాశం ఉంది. దీంతో లైసెన్సులు రెన్యూవల్ చేసుకుంటున్నారు.

రంగంలోకి ఆర్జీవీ.. ఫలితం లేదు
కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న టికెట్ ధరల వివాదంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవలే స్పందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అతడు ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు కొద్ది రోజుల పాటు హడావిడి చేశాడు. ఈ క్రమంలోనే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితోనూ చర్చలు చేశాడు. అయినా ఫలితం రాలేదు.

జగన్తో చిరంజీవి లంచ్ మీటింగ్
తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దలా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఆయనను కలవబోతున్నారు. అమరావతిలో వీళ్లిద్దరూ లంచ్ మీటింగ్లో పాల్గొంటారు. ఇందుకోసం చిరంజీవి కొన్ని గంటల్లోనే అక్కడకు చేరుకోనున్నారు.

టికెట్ రేట్లే కాదు... వాటి గురించి
అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి ప్రధానంగా టికెట్ రేట్ల విషయం మీద చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, సినీ పరిశ్రమ ఎదుర్కొంటోన్న పలు రకాల సమస్యలను సైతం సీఎం దృష్టికి తీసుకు రాబోతున్నట్లు సమాచారం. అలాగే, థియేటర్ల యాజమాన్యాల గురించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











