ఇంత నిర్లక్ష్యమా? ఎవరూ ఇలా చనిపోవద్దు: కేటీఆర్ను ప్రశ్నించిన ‘మహానటి’ దర్శకుడు!
'మహానటి' సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ ఒక బాధాకరమైన విషయం పంచుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాష్ట్రంలోనే అతిపెద్ద గవర్నమెంట్ ఆసుపత్రి గాంధీలో నెలకొన్న నిర్లక్ష్య పరిస్థితుల వల్ల తన స్నేహితుడిని కోల్పోయిన నాగ్ అశ్విన్ మంత్రి కేటీఆర్ను నిలదీశారు.
సినిమా ఇండస్ట్రీలో కెమెరామెన్గా పని చేస్తున్న నాగ్ అశ్విన్ స్నేహితుడు ఒకరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అతడిని ఆదివారం రాత్రి గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఎవరూ పట్టించుకోక పోవడంతో మూడు గంటల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడి తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం తెలిసి నాగ్ అశ్విన్ తీవ్ర మనస్థాపంతో ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

ఎవరూ కేర్ తీసుకోలేదు
నా స్నేహితుడు ఆదివారం గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతడిని గాంధీకి తీసుకెళితే ఎవరూ పట్టించుకోలేదు. ఆదివారం కావడంతో ఎవరూ అక్కడ సరైన కేర్ తీసుకోలేదని తెలిసింది.

వేరే ఆసుపత్రికి తీసుకెళితే బ్రతికేవాడేమో?
తల్లిదండ్రులు నా స్నేహితుడిని స్టెచర్ మీద పడుకోబెట్టి ప్రాణాలు కాపాడాలని ఆసుపత్రి అంతా తిప్పారు. మరో ఆసుపత్రికి తీసుకెళితే నా స్నేహితుడు బ్రతికే వాడేమో? నా సిస్టర్ కూడా గాంధీ ఆసుపత్రిలో పని చేసింది. ఆదివారం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందో నాకు వివరించింది.

మరీ ఇంత దారుణమైన పరిస్థితా?
రాష్ట్ర రాజధానిలోని అతిపెద్ద గవర్నమెంట్ ఆసుపత్రిలో మనం ఒక ప్రాణాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండదా? మరీ ఇంత దారుణమైన నిర్లక్ష్యమా? అంటూ నాగ్ అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు.

కేటీఆర్ సర్ ఏం చేయమంటారు?
ఆదివారం అయినా... మరే ఇతర వారం అయినా గవర్నమెంట్ ఆసుపత్రిలో నిర్లక్ష్యం లేకుండా, సరైన ట్మీట్మెంట్ అందించాలంటే ఏం చేయాలి సర్ అంటూ మంత్రి కేటీఆర్ను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు.

ఇలా ఎవరూ చనిపోవద్దు
మన రాష్ట్రంలోని బెస్ట్ కెమెరామెన్లలో నా ఫ్రెండ్ ఒకరు. ఇలా జరిగినందుకు ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు. ఇలా ఎవరూ అనవసరంగా ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోవద్దు అంటూ నాగ్ అశ్విన్ ఆవేద వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











