రజనీకాంత్, అనుష్క చెప్పిన పుస్తకాలు చదివా...డిస్కస్ చేసా
హైదరాబాద్ :నేను కొంతమంది దగ్గర ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చిస్తుంటాను. వాళ్లల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్లిన మహానుభావుడాయన. రజనీతో నేను 'కథానాయకుడు', 'లింగ' చిత్రాల్లో కలిసి నటించాను. ఆ షూటింగ్ సమయాల్లో మేమిద్దరం ఆధ్యాత్మికత గురించి బాగా చర్చించుకునేవాళ్లం.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఒకరోజు రజనీగారి దగ్గర 'మీరెన్నో పుస్తకాలు చదువుతుంటారు కదా.. నాకేదైనా మంచి పుస్తకం సూచించండి' అనడిగా. అప్పుడాయన 'లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్' అనే పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం ముందు పేజీలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంతకం కూడా పెట్టి ఇచ్చారు. నాకేదైనా కొత్త పుస్తకం దొరికితే చదవకుండా ఉండలేను. ఆ పుస్తకాన్ని అప్పటికప్పుడు చదవడం మొదలుపెట్టా. నాలుగు వందల పై చిలుకు పేజీలుంటాయి. రెండు రోజుల్లో ఆ పుస్తకం పూర్తి చేసేశా. ఓ కొత్త ప్రపంచంలోకి విహరించేలా చేసింది.
హీరోయిన్ అనుష్క యోగా ఎక్స్పర్ట్ అనే విషయం తెలిసిందే. తను కూడా మంచి మంచి పుస్తకాలు చదువుతుంటుంది. 'లింగ' షూటింగ్ సమయంలో మేం ఫిలాసఫీ, స్పిరిచ్యువాల్టీ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో పుస్తకాల గురించి కూడా చర్చించుకున్నాం. అప్పుడు తను నాకు 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి' అనే పుస్తకం ఇచ్చింది. అది కూడా ఏకబిగిన చదివేశా. ఇంగ్లిష్లోనే కాదు.. తెలుగులో కూడా 'ఒక యోగి ఆత్మకథ' పేరుతో ఆ పుస్తకం దొరుకుతుంది.

రజనీకాంత్గారు ఒక మీటింగ్లో ఏమన్నారంటే... ధ్యానం అంటే ఏమీ లేదు. 'కూర్చోండి.. కళ్లు మూసుకోండి. ఏ ఆలోచన వస్తే అది రానివ్వండి. బలవంతంగా ఆలోచించడం మానాలనో, వేరే ఆలోచించాలనో అనుకోకండి. అలా ధ్యానం చేయగా చేయగా.. అసలు ఆలోచనలే రాకుండా మైండ్ అంతా బ్లాంక్గా అయిపోతుంది. ధ్యానంలో అదే ఉచ్చ స్థితి.
గంట నుంచి గంటన్నర ధ్యానం చేసినప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతాను. ఎక్కువగా ధ్యాన కేంద్రాలకు వెళ్లినప్పుడు చేస్తుంటాను. వాతావరణం బాగున్నప్పుడు, ఆ సమయంలో నేను ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు ధ్యానం చేస్తా. కొంతమంది ఎదుట దీపం పెట్టుకునో లేక ఏదైనా దేవుణ్ణి మనసులో అనుకొనో ధ్యానం చేస్తారు.. అలానే చేయాలా? అలా ఏం లేదు. కొంతమంది 'ఓం మంగళం' అనుకుంటారు. ఇవేవీ అనుకోకుండా కూడా ధ్యానం చేయొచ్చు.


Click it and Unblock the Notifications











