జూ ఎన్టీఆర్ పుత్రోత్సాహం: నాలుగేళ్ల తర్వాత ట్వీట్
హైదరాబాద్: సినిమా స్టార్లంతా ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు విరివిగా ఉపయోగిస్తూ అభిమానులకు టచ్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం ఇలాంటి సోషల్ మీడియాకు కావాలనే దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో జూ ఎన్టీఆర్ కూడా ఒకరు.
2009లో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన జూ ఎన్టీఆర్.....2010లో నుండి దానికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ రోజు జూ ఎన్టీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేసారు. అందుకు కారణం ఈ రోజు జూ ఎన్టీఆర్ జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం కావడమే. ఈ రోజు ఎన్టీఆర్ తండ్రి అయ్యాడు.

'చాలా కాలం నుండి ట్విట్టర్ కు దూరంగా ఉంటున్నా. కుమారుడు పుట్టిన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా ఈ రోజు మీతో పంచుకుంటున్నా. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేసాడు.
ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని రెయిన్ బో ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డను ప్రసవించింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ వార్తతో జూ ఎన్టీఆర్ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. 2011లో జూ ఎన్టీఆర్ వివాహం లక్ష్మి ప్రణతితో జరిగిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం క్రితమే లక్ష్మి ప్రణతి గర్భవతి అయిన విషయం బయటకు వచ్చింది. శుభవార్త కోసం అభిమానులు గత కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ తండ్రి కావడంతో వారి ఎదురు చూపులు నేటితో పూర్తయినట్లయింది.


Click it and Unblock the Notifications











