పద్మశ్రీ వివాదం: మోహన్ బాబుకు సుప్రీం కోర్టులోఊరట
హైదరాబాద్: ‘పద్మశ్రీ' అవార్డును దుర్వినియోగం చేసారనే వివాదంలో నటుడు మోహన్ బాబుకు హైకోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ‘పద్మశ్రీ' అవార్డను మరెప్పుడూ దుర్వినియోగం చేయబోనని సుప్రీం కోర్టును విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ కేసులో ఊరట లభించింది. మోహన్ బాబుకు పద్మశ్రీ కొనసాగించాలని సుప్రీం తీర్పు ఇచ్చింది.
పద్మశ్రీ వివాదం ఇలా మొదలైంది...
బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి మోహన్ బాబుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ పంపారు. మోహన్ బాబు తన లెటర్ పాడ్లలో , లేదా ఉత్తరప్రత్తురాలలో కేంద్ర ప్రభుత్వం 2007లో ప్రదానం చేసిన పద్మశ్రీ బిరుదును ప్రస్తావిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన నటించిన 'దేనికైనా రెడీ' చిత్రంలో కూడా మోహన్ బాబు పేరు ముందు పద్మశ్రీ అని వేసారు. పేరుకు ముందు లేదా తర్వాత పద్మశ్రీ బిరుదును ప్రస్తావించి ఇతర ప్రయోజనాలకు వాడుకోరాదని గతంలో సుప్రింకోర్టు తీర్పు ఇచ్చిందని, కాని మోహన్ బాబు అందుకు విరుద్దంగా చేస్తున్నారని ఇంద్రసేనారెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల మోహన్ బాబుకు ఇచ్చిన పద్మశ్రీ బిరుదును వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

వివాదం కోర్టుకు...
పద్మశ్రీ వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఈ కేసును విచారించిన హైకోర్టు మోహన్ బాబు వెంటనే ‘పద్మశ్రీ' అవార్డు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై మోహన్ బాబు సుప్రీం కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. ఇంటి ముందు, సినిమాల్లో పద్మశ్రీ బిరుదును ఉపయోగించవద్దని, ఎక్కడైన పద్మశ్రీ ఉంటే తొలగించాలని సుప్రీం గత విచారణంలో సూచించింది.
తాజాగా.... ఈ కేసు తుది విచారణలో పద్మశ్రీ అవార్డను మరెప్పుడూ దుర్వినియోగం చేయబోనని సుప్రీం కోర్టును మోహన్ బాబు విన్నవించారు. ఈ నేపథ్యంలో ‘పద్మశ్రీ' అవార్డు కొనసాగించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.


Click it and Unblock the Notifications











