షిర్డీసాయి అందేకే ఫ్లాఫ్, అఖిల్ అందుకే లేటు, చేతూ ఇష్ట ప్రకారమే చేసాం: సీక్రెట్స్ రివీల్ చేసిన నాగ్
తన తాజా చిత్రం ఓం నమో వెంకటేశాయ చిత్రం రిలీజ్ సందర్బంగా ...నాగార్జున మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ : మన తెలుగు సీనియర్ హీరోలలో ఫుల్ ఫాంలో ఉన్నది ఎవరూ అంటే హీరో కింగ్ నాగార్జున అనే చెప్పాలి. వయస్సుతో సంభందం లేకుండా..ఇప్పటికీ రొమాంటిక్ హీరో పాత్రలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కూడా సై అంటూ అందరికీ షాక్ ఇస్తూ తన కుమారులకే ఆయన పోటీ ఇస్తున్నారు.
కెరీర్ పరంగా..'మనం', 'సోగ్గాడే చిన్నినాయన', 'వూపిరి'.. ఇలా వరుస విజయాలతో సినీ ప్రయాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా అక్కినేని నాగార్జున 'ఓం నమో వేంకటేశాయ' సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన నటించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఏ. మహేశ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది.
మరో ప్రక్క త్వరలో నాగార్జున కుటుంబంలో భాజాభజంత్రీలు మోగబోతున్నాయి. వ్యక్తిగత జీవితంలో త్వరలోనే మామగారు హోదా అందుకోనున్నారు. ఇప్పటికే నాగచైతన్య, అఖిల్ల నిశ్చితార్థాలు జరిపారు. వాళ్ల పెళ్లి పనులకు శ్రీకారం చుట్టే సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జున అటు సినిమా, ఇటు పెళ్లి ముచ్చట్ల గురించి 'మీడియా'తో పంచుకున్నారు.

నాన్నకు దొరికిపోకూడదని
సమంత మీ ఇంటి కోడలవుతోంది. ‘మనం' సినిమా సమయంలో చైతూ, సమంత మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని గమనించారా అని నాగ్ ని ప్రశ్నిస్తే... అస్సలు లేదండీ. నేనూ సమంత ఉన్నప్పుడు చైతూ ఉండేవాడు కాదు. చైతూ - నేనూ ఉన్నప్పుడు సమంత ఉండేది కాదు. మేమంతా కలసి చేసిన సీన్లలో మాత్రం కుదురుగానే ఉండేవారు. బహుశా నాన్నకి దొరికిపోకూడదని కంట్రోల్లో ఉండేవాళ్లేమో.

హ్యాపీగా ఉన్నా
చైతూ విషయంలో నేను హ్యాపీగానే ఉన్నా. తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొంటున్నాడు. సంబంధాలు వెతికే శ్రమ తగ్గించాడు అని అన్నారు నాగార్జున. 'మనం' చిత్రీకరణప్పుడు చై-సామ్ ప్రేమలో ఉన్నారనే సంగతి తెలీదు. ఇద్దరితో నాకు వేర్వేరుగా సీన్స్ ఉన్నాయి. మా కాంబినేషన్లోని సీన్స్లో నాన్నగారు కూడా ఉన్నారు. దాంతో జాగ్రత్త పడినట్టున్నారు.

అచ్చం అలాగే జరిగింది
‘‘మనం సినిమా క్లైమాక్స్ సీన్లో నేనూ, నాన్నగారు, సమంత, నాగచైతన్య, అఖిల్, శ్రియ ఉంటారు. అఖిల్ కాబోయే భార్య పేరు శ్రియ. ఇప్పుడు నాగచైతన్య సమంతని పెళ్లి చేసుకొంటున్నాడు. అలా అది మా ఫ్యామిలీ గ్రూప్ ఫొటో అయిపోయింది. సమంత మా ఇంటి కోడలు అవుతుందని నాన్నగారు ముందే గ్రహించేశారేమో అనిపిస్తుంటుంది. చైతూ పెళ్లి ముందా, అఖిల్ పెళ్లి ముందా? అంటే ఏం చెప్పలేకపోతున్నా. నిశ్చితార్థం కూడా చైతూ ఇష్టప్రకారమే, తాను చెప్పిన డేట్కే చేశాం. పెళ్లి ఎప్పుడనేది తానే నిర్ణయించుకోవాలి'' అన్నారు నాగార్జున.

అప్పుడు అర్దమైంది
'మనం'లో లాస్ట్ ఫ్రేమ్ గురించి నాన్నగారు ఎంత అందంగా ఆలోచించారనేది... 'మా అమ్మే ఇప్పుడు నా కూతురైంది' అని చై-సామ్ నిశ్చితార్థం ఫొటో ట్వీట్ చేసినప్పుడు అర్థమైంది. అఖిల్ పెళ్లాడబోయే అమ్మాయి పేరు శ్రియ. 'మనం' లాస్ట్ ఫ్రేమ్ చూస్తే.. మా ఫ్యామిలీలో అందరి పేర్లు ఉన్నాయి. నాన్నగారే ఆయన చివరి చిత్రంలో అలా ప్లాన్ చేశారనుకుంటున్నా!

పట్టించుకోవటం మానేసా
‘‘ఈ సినిమా రికార్డులు, వసూళ్లు, నెంబర్ గేమ్ల గురించి నేను పట్టించుకోవడం ఎప్పుడో మానేశా. అప్పటి నుంచీ హాయిగా ఉంది. నాకు నచ్చిన సినిమాల్ని చేసుకొంటూ వెళ్తున్నా. ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు. కొన్ని కొన్ని సినిమాలు ఎందుకు ఆడుతున్నాయో, ఇంకొన్ని ఎందుకు ఆడవో అస్సలు అర్థం కాదు. పోటీగా వచ్చిన సినిమాలు కూడా మన సినిమా ఫలితంపై ప్రభావం చూపిస్తుంటాయి. ‘సాహసం శ్వాసగా సాగిపో' మంచి సినిమానే. సరిగ్గా నోట్ల రద్దు ప్రకటించిన తొలి రోజుల్లో విడుదలైంది. దాంతో వసూళ్లు దక్కించుకోలేకపోయింది'' అని చెప్పారు నాగార్జున.

డిజాస్టర్స్ అవుతాయి
ఒక్కోసారి యావరేజ్ సినిమా సూపర్ హిట్టవుతుంది. ఎలా? అంటే.. ఎవరూ చెప్పలేరు. వేరే సినిమాలు చెత్తగా ఉండొచ్చు లేదా రీలీజైన సీజన్ ఓ కారణం కావొచ్చు. కొన్నిసార్లు మంచి సినిమాలు డిజాస్టర్స్ అవుతాయి. కానీ, మేమంతా మంచి సినిమా తీయాలని ప్రయత్నిస్తాం అన్నారు నాగార్జున.

కొత్త కథలొస్తాయి
గతేడాది 'సాహసం శ్వాసగా సాగిపో' విడుదల టైమ్లో బాధగా అనిపించింది. 'ప్రేమమ్' తర్వాత నాగచైతన్యకి మంచి సినిమా అయ్యేది. అలాంటి సినిమాలు ఆడితే కొత్త కథలొస్తాయి. కానీ, డీమానిటైజేషన్ ని ఎవరూ ఊహించలేదు. సినిమా డీసెంట్గా ఉందన్నా సరిగా ఆడలేదు. ఇప్పుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చైతన్య చేస్తున్న సినిమా 'నిన్నే పెళ్ళాడతా' తరహాలో ఉంటుంది.

వాడి ఇష్ట ప్రకారమే..
నాగచైతన్య, సమంత ల పెళ్లి ఎప్పుడు అని అడిగితే..వాడెప్పుడంటే అప్పుడే. అసలు జనవరిలోనే నిశ్చితార్థం చేసుకుంటానని చెప్పాడు. వాడి ఇష్ట ప్రకారమే చేశాం. పెళ్లి విషయంలోనూ అంతే. చై, సామ్లు ఎక్కడ చేసుకుంటామన్నా ఎప్పుడు చేసుకుంటామన్నా మేం సిద్ధమే అన్నారు నాగార్జున.

శివ లాంటి సినిమా అవుతుంది
అఖిల్ రెండో సినిమా ఆలస్యం అవుటానికి కారణం చెప్తూ....వెంటనే మొదలెట్టేయాలన్న తొందరేం లేదు. విక్రమ్ కె.కుమార్ ఇది వరకు ఓ కథ చెప్పాడు. ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్లో కొన్ని డౌట్లు అడిగా. నాకే ఇన్ని డౌట్లు వచ్చాయంటే.. రేపు సినిమా చూసే ప్రేక్షకులకు ఇంకెన్ని వస్తాయనుకొన్నాడో ఏమో, ఆ కథని పక్కన పెట్టేసి మరో కొత్త కథ వినిపించాడు. నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోజుల్లో ‘శివ' ఎలా ఓ ట్రెండ్ సెట్టర్లా నిలిచిందో.. అలాంటి కథ అఖిల్కి దొరికింది అనిపించింది.

క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటారు
‘అన్నమయ్య' తరవాత మళ్లీ వేంకటేశ్వరుడి కథ... పైగా ఎవ్వరికీ పెద్దగా తెలియని హాథీరామ్ బాబా గురించిన సినిమా. సాహసం చేస్తున్నట్టు అనిపించలేదా? అని అడిగితే... రాఘవేంద్రరావుగారితో ఈ మాటే చెప్పాను. ‘అన్నమయ్య' తరవాత మళ్లీ అంత గొప్ప సినిమా తీయలేం. ఇప్పుడీ కథ అవసరమా? ఆలోచించండి.. అన్నాను. ‘ఓసారి కథ విను' అన్నారాయాన. నిజంగానే ‘అన్నమయ్య' కంటే మంచి కథ చెప్పారు. ‘అన్నమయ్య' క్లైమాక్స్ గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకొంటుంటారు. ఆ స్థాయి భావోద్వేగాలు ‘ఓం నమో..'లోనూ కనిపించాయి అన్నారు నాగార్జున.

సక్సెస్ అవుతున్నాడు
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అఖిల్ చేయబోయే సినిమా 'శివ' టైపులో ట్రెండ్ సెట్టింగ్ అవుతుందని నా నమ్మకం. ఫిల్మ్ మేకింగ్ లెక్కలను పూర్తిగా మార్చేసే చిత్రమది. 'అఖిల్' పెద్ద హిట్టయితే.. ఈ సినిమాకి మరింత హైప్ వచ్చేదేమో! కానీ, ఇప్పటికీ హైప్ మెయిన్టైన్ చేయడంలో అఖిల్ సక్సెస్ అవుతున్నాడు. 'నువ్వు ఎలా చేస్తున్నావ్? రా! నేను నీ దగ్గర నేర్చుకోవాలి' అన్నాను అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.

మరో సారి భక్తుడుగా
త్వరలో మరోసారి భక్తుడిగా నటించిన ఓం నమో వేంకటేశాయ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాగ్. ఇది నాగ్ తెర మీద కనిపిస్తున్న 98వ సినిమా. ఈ 98 చిత్రాల్లో కొన్ని నాగ్ అతిథి పాత్రల్లో కనిపించిన చిత్రాలు కూడా ఉన్నాయి.

మరో రెండు
ఈ సినిమా తరువాత నాగ్ చేయబోయే రెండు సినిమాలు కూడా ఇప్పటికే ప్రకటించేశారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజుగారి గది 2' సినిమా ఇప్పటికే ప్రారంభం కాగా.. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాకు ఓకె చెప్పాడు. ఇదే నాగ్ నటించే వందో సినిమా. దీంతో అభిమానులు బంగార్రాజు సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు.

నా లెక్కే వేరు
కానీ నాగ్ మాత్రం బంగార్రాజు తన వందో సినిమా కాదని చెపుతున్నాడు. తాను అతిథి పాత్రల్లో నటించిన సినిమాలు తన లెక్కలోకి రావని.. అందుకే తన వందో సినిమా విషయంలో తన లెక్కవేరని చెపుతున్నాడు. త్వరలోనే ఆ లెక్క అభిమానులకు చెప్తానంటున్న కింగ్.. వందో సినిమా కోసం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడట.

తేల్చి చెప్పాడు
గత కొద్ది రోజులుగా అక్కినేని నాగార్జున, ఆయన పెద్ద కుమారుడు నాగచైతన్య కలిసి సినిమా చేయనున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే నాగార్జున ఈ విషయమై ఖండిస్తూ ట్వీట్ చేసారు. ‘నేను, చైతన్య కలిసి సినిమా చేస్తున్నామనే వార్తలు వినబడుతున్నాయి. ఇది నాక్కూడా పెద్ద న్యూస్ లానే ఉంది' అంటూ ఆ వార్తల్లో వాస్తవం లేదని, అలాంటి ప్లాన్స్ ఏవీ లేవని ట్విట్టర్ ద్వారా తేల్చి చెప్పారు.

గ్రాఫిక్స్ ప్రధానం
తన తాజా చిత్రం గురించి చెప్తూ...ఇందులో నేను వెంకటేశ్వరస్వామి భక్తుడైన హాథీరాం బాబా పాత్రలో కనిపిస్తాను. అసలు ఆయన గురించి ఎక్కువగా తెలీదు. చిత్రబృందం హాథీరాం గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న మఠాలన్నీ తిరిగింది. తెలిసినంత వరకు ఈ సినిమాలో చూపించబోతున్నాం. అదీకాకుండా సినిమాలో గ్రాఫిక్ ఎఫెక్ట్స్ చాలా ప్రధానం. అవే సినిమాకి ప్రాణం. ముఖ్యంగా నాకు వెంకటేశ్వరస్వామికిమధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

నాకు నచ్చలేదు
16వ శతాబ్దంలో తిరుమలేశుడి గుడికి బంగారు పూతలేదు. రాతి గుడిలో ఓ అందం ఉంటుంది. ఇప్పుడు మోడ్రన్ ఆర్ట్ వర్క్ పేరుతో చాలా గుళ్లకు రంగులు వేయడం నాకు నచ్చడం లేదు. ఈ చిత్రం కోసం అప్పటి రాతి గుడి సెట్ వేయడం, గ్రాఫిక్స్లో వైకుంఠం, ఆనంద లోకం, పాల సముద్రం వంటివి సృష్టించ డం సవాల్తో కూడుకున్నవే. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉండడంతో ఫిబ్రవరికి వస్తుందా? లేదా? అని భయపడ్డా. గ్రాఫిక్స్, సీజీ వర్క్ సరిగా లేకుండా ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ కాలేరు.

డాక్యుమెంటరీలా తీసాం
ఇంతకు ముందు వచ్చిన ‘శిరిడీసాయి' సరైన ఫలితాన్ని అందుకోలేదు. దాన్ని ఓ డాక్యుమెంటరీలా తీశాం. సాయిబాబా జీవితకథకు తగ్గట్టుగా, వాస్తవాలు ప్రతిబింబించేలా సినిమా తీశాం. చిన్న చిన్న సెట్లు వేయాల్సివచ్చింది. దాంతో సినిమా చుట్టేశామన్న ఫీలింగ్ కలిగింది. బాబా జీవితంపై డాక్యుమెంటరీ కోసం యూట్యూబ్లో చూస్తే సరిపోతుంది. దాని కోసం సినిమాకి ఎందుకొస్తారు? అన్న ఆలోచన ఆ రోజున మాకు రాలేదు. పైగా అవసరం లేకపోయినా కామెడీ ట్రాక్ జోడించాం. ‘ఇవి లేకపోతే సినిమా చూడరేమో' అనే అపోహలో ఉండేవాళ్లం. ఇప్పుడు అలాంటిదేం లేదు. కామెడీ ట్రాక్ కోసం సినిమా చూడరు. సినిమాలో విషయం ఉంటే తప్పకుండా చూస్తారనిపించింది.

ఆయన అలా చెప్పేవారు నాతో..
‘ఇదే రాఘవేంద్రరావు గారి ఆఖరి సినిమా అవుతుందేమో' అని అనటం గురించి చెప్తూ..షూటింగ్ సమయంలో నాతో అలా చెప్పేవారు. కానీ ఆయన మరిన్ని సినిమాలు చేయాలి. ఒకవేళ ఇదే ఆఖరి సినిమా అయినా కూడా రాఘవేంద్రరావు గారు సగర్వంగా చెప్పుకొనే సినిమా అవుతుంది. నాన్నగారికి ‘మనం' ఎలా క్లాసిక్లా నిలిచిపోయిందో... రాఘవేంద్రరావుగారికి అలాంటి గొప్ప విజయాన్ని అందివ్వాలి అన్నారు నాగార్జున.

ఒత్తులు పలకరా అని నాన్నగారు..
‘అన్నమయ్య' తరవాత తెలుగు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నా. అప్పటి వరకూ నాన్నగారు ‘ఒత్తులు పలకరా..' అంటూ చెప్పేవారు. బాధని బాద అనో భాధ అనో పలికేవాడ్ని. ‘అన్నమయ్య' తరవాత భాషపై, తెలుగుపై పట్టు వచ్చింది. నాతో ఇప్పుడు వాయిస్ ఓవర్లు కూడా చెప్పించుకొంటున్నారంటే అదంతా ‘అన్నమయ్య' పుణ్యమే. ‘వూపిరి' సినిమా చేస్తున్నప్పుడు మన శరీరం మనకు ఎంత ముఖ్యమో.. కాళ్ల గొప్పదనం ఏమిటో తెలిసొచ్చింది. సినిమా అంతా కుర్చీలోనే కూర్చోవడం కదా? షూటింగ్ అయ్యేసరికి వెన్ను నొప్పి వచ్చేది. కాస్త గ్యాప్ ఇస్తే... ఆ సెట్ చుట్టూ తెగ తిరిగేసేవాడ్ని.


Click it and Unblock the Notifications











