పవన్ వల్ల...ఎరక్కపోయి ఇరుక్కున్న సంపత్ నంది!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా చేసే అవకాశం అంటే ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన దర్శకుడు ఎవరికైనా......బంపర్ ఆఫర్ అన్నట్లే. అలాంటి బంపర్ ఆఫర్ దక్కితే ఎవరైనా సంతోషంతో చిందులేస్తారు. దర్శకుడు సంపత్ నంది కూడా మొదట్లో చాలా సంతోష పడ్డాడు. కానీ ఇపుడు అతని ఫేసులో సంతోషం అస్సలు లేదట.
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోయే 'గబ్బర్ సింగ్-2' చిత్రానికి సంపత్ నంది దర్శకుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే అవకాశం దక్కినందుకు ఆయన అదృష్ణ వంతుడా? సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేక పోవడంతో పాటు ఇతర ప్రాజెక్టులు సైతం మొదలు పెట్టే అవకాశం లేక పోవడంతో దురదృష్ట వంతుడా? అర్థం కావడం లేదని అని ఫిల్మ్ నగర్ జనాలు అంటున్నారు.

'గబ్బర్ సింగ్-2' ప్రాజెక్టు ఖరారై చాలా రోజులే అయినప్పటికీ.....వివిధ కారణాలతో ప్రారంభోత్సవం కూడా చాలా లేటయింది. ప్రారంభోత్సవం జరిగిందనే సంతోషం సంపత్ నంది ముఖంలో ఎన్నో రోజులు నిలవలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల బాట పట్టడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నాడు సంపత్. మరో వైపు 'ఓ మై గాడ్' చిత్రానికి కూడా పవన్ డేట్స్ ఇవ్వడం వల్ల కూడా 'గబ్బర్ సింగ్-2' ప్రాజెక్టు మరింత లేటవుతుందని అంటున్నారు.
పవన్ ఎప్పుడు మళ్లీ ప్రాజెక్టు మీదకు వస్తాడో క్లారిటీ లేక పోవడంతో ఇతర ప్రాజెక్టులకు కూడా కమిట్ కానిపరిస్థితుల్లో దర్శకుడు ఉన్నాడు. సంపత్ నంది నుండి 'రచ్చ' సినిమా వచ్చి దాదాపు రెండేళ్లయింది. పవన్ కళ్యాణ్తో సినిమా కమిట్ అయి ఉండకపోతే సంపత్ నంది ఇప్పటికి కనీసం రెండు సినిమాలు చేసి ఉండే వాడని, 'గబ్బర్ సింగ్-2' కమిట్ అయిన కారణంగా ఎరక్కపోయి ఇరుక్కున్న చందంగా తయారైంది అతని పరిస్థితి.
దీంతో సొంత సినీ నిర్మాణ సంస్థను స్థాపించిన సంపత్ నంది నిర్మాతగా ప్రయాణం మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు. సంపత్ నంది టీమ్ వర్క్స్ పేరుతో ఓ బ్యానర్ నెలకొల్పి సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నవీన్ గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











