'ఈగ'.. నీకు ధన్యవాదాలు!: రాజమౌళి
హైదరాబాద్: నెలరోజుల విహారయాత్ర తర్వాత రాజమౌళి తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తన యాత్ర అనుభవాలను ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు రాజమౌళి.
''బుసాన్లో 'బాహుబలి' ప్రదర్శన తర్వాత నన్ను అక్కడివారికి 'ఈగ' దర్శకుడు అని పరిచయం చేశారు. 'ఈగ'ను 2012 బుసాన్లో ప్రదర్శించిన విషయాన్నీ ప్రస్తావించారు. ఆ మాట విన్న వెంటనే అక్కడి ప్రేక్షకుల్లో ఆశ్చర్యం చూశాను. కార్యక్రమం పూర్త్తెన తర్వాత చాలామంది మా 'ఈగ' డీవీడీ మీద ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. నా కెరీర్కు ఆ సినిమా ఎంతో ఉపయోగపడింది. 'ఈగ'కు ధన్యవాదాలు'' అని ఫేస్బుక్లో రాసుకొచ్చారు.
దక్షిణ కొరియాలోని బుసాన్ సినిమా సెంటర్ లో ప్రపంచ ప్రఖ్యాత బుసాన్ చలన చిత్రోత్సవం జరుగుతోంది... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చిత్రాలను అక్కడ ప్రదర్శిస్తుంటారు. ఆ సెంటర్లో ఓవైపు సినిమాల ప్రదర్శన జరుగుతోంది. మరోవైపు చూస్తే అక్కడి యువత పెద్ద క్యూ కట్టేసింది. ఏ టికెట్ల కోసమో, పాస్ల కోసమో కాదు.

ఓ వ్యక్తి ఆటోగ్రాఫ్ కోసం. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన దర్శక 'బాహుబలి' రాజమౌళి. బుసాన్ చిత్రోత్సవంలో 'బాహుబలి: ది బిగినింగ్'ను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. అక్కడి యువతకు రాజమౌళి ఆటోగ్రాఫ్లు ఇస్తున్న ఫొటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
ఈ సందర్భంగా రాజమౌళి అక్కడి మీడియాతో మాట్లాడుతూ ''బాహుబలి: ది బిగినింగ్' విజయం వెనుక విజువల్ ఎఫెక్ట్స్, యుద్ధం నేపథ్యంలోని సన్నివేశాలది ప్రముఖ స్థానం. 'బాహుబలి' రెండో భాగం నుంచి ప్రేక్షకులు ఎంతగా ఆశిస్తున్నారో మాకు అర్థమైంది. వాళ్లను నిరాశపరచకూడదని మా బృందం ఎంతో కష్టపడుతోంది. 'బాహుబలి: ది కంక్లూజన్' భారీగా ఉండబోతోంది. తొలి భాగాన్ని మించిపోయే భావోద్వేగాలతో రెండో భాగాన్ని తీర్చిదిద్దుతాం'' అన్నారు.
బుసాన్లో 'బాహుబలి: ది బిగినింగ్'ను ఈ నెల 4న ప్రదర్శించగా... 7న, 9న మరో రెండు ప్రదర్శనలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











