గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన రాజేంద్రప్రసాద్
హైదరాబాద్: ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ గుండె నొప్పితో సోమవారం ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. గత కొంత కాలంగా గుండె సంబంధమైన సమస్యలతో రాజేంద్రప్రసాద్ బాధ పడుతున్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు.
రాజేంద్రప్రసాద్ ఇటీవల విడుదలైన 'జులాయి' చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆయన ఈ చిత్రంలో పోషించిన పోలీసాపీర్ పాత్ర హాస్యాన్ని పండించడంతో పాటు సినిమాకు కీలకంగా మారింది. ఆయన తాజా సినిమా 'ఓనమాలు'ఒక మంచి సందేశాత్మక చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.
డా.రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో క్రాంతిమాధవ్ స్వీయ దర్శకత్వంలో 'ఓనమాలు' చిత్రం రూపొందింది. రాజేంద్రప్రసాద్.. నారారణరావు మాస్టారిగా చేసిన ఈ చిత్రంలో పల్లెటూరి ప్రాముఖ్యతపై చర్చించారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ 'డ్రీమ్', 'నూతిలో కప్పలు' అనే చిత్రాలు చేస్తున్నారు.
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో పోల్స్టార్ పిక్చర్స్ పతాకంపై చంటి జ్ఞానమణి దర్శకత్వంలో వినయ్, పూనాటి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నూతిలో కప్పలు' (పైకి రావు, రానివ్వవు). పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ 70 శాతం పూర్తియింది.


Click it and Unblock the Notifications











