చిరంజీవి 150వ సినిమా, విజయశాంతి సినిమా ఓకేసారి..
హైదరాబాద్: ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ విజయశాంతి త్వరలో మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గత కొన్నేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉండటం, ఆపై అనారోగ్యానికి గురి కావడం లాంటి కారణాలతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె త్వరలో మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు.
తాను మళ్లీ సినిమాల్లోకి వస్తున్న విషయాన్ని స్వయంగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో బిజీగా ఉండటం, అనారోగ్యం కారణంగా ఇంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, త్వరలో దేశభక్తికి సంబంధించిన కథతో తనకు సూటయ్యే పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఈ సినిమాకు విజయశాంతి స్వయంగా నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కథలు వింటూ బిజీగా గడుపుతున్నారు. అయితే సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయానికి ఆమె సమాధానం ఇస్తూ చిరంజీవి 150వ సినిమా, తన సినిమా ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ఒకప్పుడు చిరంజీవి, విజయశాంతి తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్బ్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకలు థియటర్లు పరుగులు పెట్టే వారు. ఇద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఇద్దరూ చాలా కాలంగా రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటన్నారు. మళ్లీ ఇద్దరి సినిమా ఒకేసారి వస్తుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











