ఆ డబ్బు ఏమైనట్లు? చిక్కులో రజనీకాంత్, ధర్నా...
హైదరాబాద్: సూపర్స్టార్ రజనీకాంత్ ‘లింగా' చిత్రం ఎన్ని సమస్యలు ఎదుర్కొందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ భారీ బడ్జెట్ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. తాము నష్టపోయిన డబ్బు తిరిగి రాబట్టుకునేందుకు అప్పట్లో కొన్ని నెలల పాటు పోరాట చేసారు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు.
మొత్తం 34 కోట్లు నష్టం రాగా.....పలు దఫాల చర్చల అనంతరం ఎట్టకేలకు రూ. 12.5 కోట్ల నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పుకున్నాడు నిర్మాత. కొన్ని నెలల క్రితమే ఈ మ్యాటర్ సెటిల్ అయిపోయింది. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్థాను, దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్కుమార్ రంగంలోకి దిగి ఈ వివాదాన్ని సెటిల్మెంట్ చేసారు.

అయితే మళ్లీ ‘లింగా' డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళనకు దిగారు. నష్టపరిహారంగా చెల్లిస్తామన్న రూ. 12.5 కోట్లు ఇప్పటి వరకు వారికి చేరలేదట. ఇప్పటి వరకు రూ. 6 కోట్లు మాత్రమే వారికి అందాయని సమాచారం. డబ్బుల కోసం ఇన్నాళ్లు ఎదురు చూసిన డిస్ట్రిబ్యూటర్లు చివరకు మీడియ ముందుకు వచ్చారు. నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి తమను నమ్మించి మోసం చేసారని, ఇప్పటి వరకు డబ్బు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
కలైపులి ఎస్థాను తదితరులు తమను నమ్మించి గొంతు కోశారని ఆరోపించారు. వారంలోపు ఎంజీ విధానం పై లింగా చిత్రాన్ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లకు,ఎగ్జిబిటర్లకు నష్టపరిహారం చెల్లించకపోతే 13 తేదీన నటుడు రజనీకాంత్ ఇంటి ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











