తెలుగులో హిట్...ఇప్పుడు హాలీవుడ్ రీమేక్
చెన్నై:విజయ్ సేతుపతి, రమ్య నంబీసన్ జంటగా కార్తీక్ సుబ్బరాజు దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందిన తమిళ చిత్రం 'పిజ్జా'. తమిళంలో ఈచిత్రం విజయవంతం కావడంతో ఎస్.కె. పిక్చర్స్ అధినేత సురేష్ కొండేటి ఈ చిత్రం తెలుగు హక్కులను సొంతం చేసుకుని విడుదల చేసారు. థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో రూపొందిన 'పిజ్జా' సినిమా తెలుగులోనూ బాగా ఆడింది. ఇప్పుడా చిత్రం హాలీవుడ్ లో రీమేక్ కానుంది.
వివరాల్లోకి వెళితే...రీసెంట్ గా రివర్ టు రివల్ ఫ్లోరెన్స్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్..2013 ఇటలీలో జరిగింది. అక్కడ ఈ చిత్రాన్ని చూసిన హాలీవుడ్ నిర్మాత ఆమోల్ ఈ చిత్రం రైట్స్ తీసుకోవటం జరిగింది. త్వరలోనే అక్కడ నటీనటులతో మంచి బడ్జెట్ లో ఈచిత్రాన్ని చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు, ఎగ్రిమెంట్ జరిగిందని తమిళ సినిమా వర్గాల భోగట్టా.

పిజ్జా కథ విషయానికి వస్తే... మైఖేల్(విజయ్ సేతుపతి) పిజ్జా డెలివరీ బాయ్. తన గర్ల్ ఫ్రెండ్ అను(రమ్య నంబీసన్)తో కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తుంటాడు. అనుకి దెయ్యాలపై నమ్మకం ఎక్కువ. దయ్యాలపై నవల రాసేందుకు అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది. కానీ మైఖేల్కి ఇలాంటి వాటిపై పెద్దగా నమ్మకం ఉండదు. ఈ క్రమంలో పిజ్జా రెస్టారెంట్ ఓనర్ షన్ముగం(నరేన్)కూతురుకి దెయ్యం పడుతుంది. అప్పటి నుంచి అతనిలో దెయ్యాలంటే భయం మొదలవుతుంది. ఓ సారి పిజ్జా డెలివరీ చేయడానికి ఓ ఇంటికి వెళ్లిన మైఖేల్ భయానక పరిస్థితులు ఎదుర్కొంటాడు. అదే సమయంలో అను మిస్సవుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ప్రేక్షకులకు సస్పెన్స్, థ్రిల్లింగ్ అనుభూతినిస్తాయి.
ఇండియన్ బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో 'పిజ్జా' కూడా చోటు దక్కించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు వండర్ పుల్ స్టోరీలైన్ తో పాటు దానికి తగిన విధంగా స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. కమర్షియల్ అంశాలను ఆశించకుండా హారర్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం సరికొత్త అనుభూతిని ఇస్తుంది.


Click it and Unblock the Notifications











