నాకొడుకుతో పాటు నన్ను చంపేయండి: శింబు తల్లి కంటతడి! (వీడియో)
హైదరాబాద్: తమిళ హీరో శింబు ‘బీప్' సాంగ్ వ్యవహారంపై తమిళ నాడులో పెద్ద వివాదమే సాగుతోంది. పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులకు దొరకకుండా శింబు పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే శింబు పోలీసుల ముందు లొంగి పోవాల్సి ఉన్నా....ముందస్తు బెయిల్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతను అజ్ఞాతం వీడటం లేదు.
అయితే శింబుపై తమిళనాడులో ఆందోళనలు తీవ్రం అయ్యాయి. మహిళలను కించపరిచే విధంగా బీప్ సాంగ్ ఉండటంతో మహిళ సంఘాలు, ప్రజా సంఘాలు అతనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. పలు చోట్ల శింబు దిష్టిబొమ్మలు దగ్దం చేయడంతో పాటు అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే ఉరితీయాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
శింబు వ్యవహారం ముదురుతుండటంతో అతని తల్లిదండ్రులో ఆందోళన చెందుతున్నారు. మీడియా ముందు శింబు తల్లి ఉష కంటతడిపెట్టుకున్నారు. నా కొడుకు ఏం తప్పు చేసాడు? వాడు ఇంకా చిన్న కుర్రాడే, ఇంకా పెళ్లి కూడా కాలేదు, అది ఆకతాయితనంతో చేసిన పాట. అది బాగోలేక పోవడంతో పక్కన పడేసాడు. ఎవరో గిట్టని వాళ్లు దాన్ని దొంగలించి బయట పెట్టారు...ఎవరో పాట దొంగిలిస్తే నా కొడుకును ఉరితీస్తారా? అంతకంటే ముందు నా ప్రాణం తీసుకోండి అంటూ ఎమోషనల్ గా స్పందించారు.
నా కొడుకు ఏ తప్పూ చేయలేదు, ఆ పాటను ఎక్కడా పబ్లిక్ గా పాడలేదు. దాన్ని ఎవరో కావాలని దొంగిలించి అతనిపై కుట్ర చేసారు. శింబు ఎదగకుండా తోటి నటులే కుట్ర చేస్తున్నారు. ఇదేం రాష్ట్రం. ఓ వైపు వరద బాదితులు తిండిలేక అలమటిస్తుంటే వారి గురించి పట్టించుకోకుండా నా కొడుకు ఏదో ఘోరం చేసినట్లు చూస్తున్నాు. ఈ రాష్ట్రంలో మేం బ్రతకలేం...వేరే రాష్ట్రానికి వెళ్లి మా బతుకులు మేము బ్రతుకుతాం. మమ్మల్ని ఇంతవారిని చేసిన తమిళనాడుకు థాంక్స్ అంటూ....శింబు తల్లి ఉష తన మనసులోని ఆవేదనను బయట పెట్టారు.


Click it and Unblock the Notifications











