అమీర్ ఖాన్ 'సత్యమేవ జయతే-2' ఈరోజు నుంచే
హైదరాబాద్: మారుమూల ప్రాంతాల్లోని సామాజిక సమ్యసల్ని 'సత్యమేవ జయతే' కార్యక్రమం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు అమీర్ఖాన్. ఆడపిల్లలపై వివక్ష, చిన్నారులపై లైంగిక దాడులు, వరకట్నం, ఔషధాల అక్రమ పరీక్షలు, ప్రేమ వివాహాలు - పరువు హత్యలు, వికలాంగులు, గృహ హింస, సేంద్రీయ వ్యవసాయం - రసాయన ఎరువుల వాడకం, మద్యపానం, కులవివక్ష - అంటరానితనం, వృద్ధుల బాధలు, నీటిఎద్దడి, వర్షపునీటి వినియోగం... ఇలా 13 ఎపిసోడ్లతో వచ్చిన తొలి భాగం దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఇప్పుడు 'సత్యమేవ జయతే-2'ని సిద్ధం చేశారు. 'సత్యమేవజయతే-2' ఈటీవీలో నేటి నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమవుతుంది
అమీర్ ఖాన్ మాట్లాడుతూ...దేశానికి, ప్రజలకు మంచి చేయాలని నాకే కాదు అందరికీ ఉంటుంది. అందుకే మార్పు కోసం మేం చేసిన ఈ ప్రయత్నం అందరికీ నచ్చింది. ఈ కార్యక్రమంలో వినోదం ఏమీ ఉండదని, ఆదరణ కష్టమని కొందరు మొదట్లో అభిప్రాయపడ్డారు. ఇందులో మేము ఎంచుకున్న విషయాలన్నీ ప్రేక్షకులు నిత్య జీవితంలో చూసేవే. అందుకే ఆదరించారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో మార్పు రావాలనే కోరిక అందరికీ ఉందని తెలిసింది. మేం అనుకున్నది, కోరుకున్నది ఇదే. ఈ విజయానందంతోనే రెండో భాగం చేశాం అన్నారు.

అలాగే ...తొలి భాగంలో మేము ఎంచుకున్న అంశాలు సమాజంలో చాలామందిలో ఆలోచనల్ని, చైతన్యాన్ని కలిగించాయి. రెండో భాగంలోనూ ఇదే స్థాయిలో అంశాల్ని ఎంపిక చేసుకున్నాం. అవేంటనేది కార్యక్రమంలో చూస్తేనే బాగుంటుంది. మార్చిలో ఐదు ఆదివారాలు ఐదు విభిన్న అంశాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. కొద్ది రోజులు విరామం తీసుకొని మళ్లీ మరో మారు మరికొన్ని అంశాలతో వస్తాం. ఇలా మూడు సార్లు జరుగుతుంది అన్నారు.
విరామం ఎందుకు తీసుకుంటున్నారో చెప్తూ...మేము చెప్పే అంశాల గురించి ప్రజలు ఆలోచించాలి. అందుకే ఈ విరామం. దీని వల్ల మేము లేవనెత్తిన అంశాలు ప్రజల్లోకి లోతుగా వెళ్తాయి. ఈ సారి ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నాం. అందుకే ఫోన్ ఓటింగ్ ఏర్పాటు చేశాం. ఎపిసోడ్పై ప్రజల అభిప్రాయాల్ని మిస్డ్కాల్ ఓటింగ్ ద్వారా తెలుసుకుంటున్నాం. మేం ఇచ్చిన నంబరుకు మిస్కాల్ ఇస్తే ప్రేక్షకులు మేం చెప్పిన అంశానికి అంగీకరించినట్లు అవుతుంది అన్నారు.
ఓటింగ్ విధానం ఎందుకు ప్రవేశపెట్టడానికి కారణం చెప్తూ...ఈ కార్యక్రమంలో లేవనెత్తిన అంశాల విషయంలో ప్రజల అభిప్రాయాల్ని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. దీని వల్ల ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. అంతేకాదు దేశ మార్పులో అందరికీ భాగస్వామ్యం కల్పించేలా ఉంటుంది కదా అని వివరించారు.


Click it and Unblock the Notifications











