ఆ విషయంలో నేనూ బాధితుడినే: చిరంజీవి
Chiranjeevi Reacts to Deepfake: డీప్ఫేక్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలను కలిగిస్తోంది. ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి మనుషుల జీవితాలను సులభతరం చేయడంలో సహకరించినా, అదే టెక్నాలజీ తప్పు చేతుల్లో పడితే అది విపత్తుగా మారుతుందని స్పష్టమవుతోంది. కృత్రిమ మేధస్సు (AI)లో వీడియో,ఆడియో, లేదా ఫోటోలను మార్చి నిజం లాగా కనిపించే తప్పుడు కంటెంట్ను సృష్టిస్తుంది. ఇలాంటి తప్పుడు వీడియోల వల్ల రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, సామాన్య ప్రజలు కూడా బలవుతున్నారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు ప్రముఖుల వీడియోలు బయటకు రావడంతో సమాజం కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో డీప్ఫేక్ వీడియోల దుష్ప్రభావంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా హైదరాబాదు నెక్లెస్ రోడ్లో జరిగిన 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమంలో చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్తో కలిసి ఐక్యతా పరుగును ప్రారంభించారు. "560 సంస్థానాలను ఏకం చేసి భారతదేశాన్ని ఒకే దేశంగా మార్చిన సర్దార్ పటేల్ గారి దృఢ సంకల్పం మన అందరికీ స్ఫూర్తి కావాలి" అని చిరంజీవి అన్నారు. ఆ తరువాత చిరంజీవి మాట్లాడుతూ.. "డీప్ఫేక్ అనేది చాలా ప్రమాదకరం. ఇది వ్యక్తిగత ప్రతిష్ఠను మాత్రమే కాదు, కుటుంబాల గౌరవాన్ని కూడా దెబ్బతీస్తుంది" అని హెచ్చరించారు.

"ఇలాంటి నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. టెక్నాలజీని మంచి కోసం వినియోగించుకోవాలి కానీ, దానిని దుర్వినియోగం చేస్తే సమాజం నాశనం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు తప్పవు" అని చిరంజీవి పిలుపునిచ్చారు.ఇటీవల తాను కూడా డీప్ఫేక్ బారిన పడ్డానని, తన ఫొటోలను దురుద్దేశపూర్వకంగా మార్ఫింగ్ చేశారని ఆయన వెల్లడించారు. ఇటీవల కొందరు తన ఫొటోలను దుర్వినియోగం చేసి, అశ్లీల వీడియోలు రూపొందించారని మెగాస్టార్ తెలిపారు.
ఇలాంటి చర్యలు జరగకుండా కఠిన చట్టాలు, వేగవంతమైన దర్యాప్తు, ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారానే ఈ సమస్యను అరికట్టవచ్చి చిరంజీవి అభిప్రాయపడ్డారు. "తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉంది. వారు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. సైబర్ నేరాల విషయంలో కూడా వారు చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నారు" అని చిరంజీవి పేర్కొన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు ధైర్యంగా ఫిర్యాదులు చేయాలని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన హితవు పలికారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన హైదరాబాదు సీపీ వీసీ సజ్జనార్, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. చిరంజీవి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి చర్యలు ప్రారంభించారు. డీజీపీ గారు, సీపీ గారు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. సైబర్క్రైమ్ పోలీసులు చిరంజీవి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో భాగంగా 'ఎక్స్' (Twitter) లో "దయా చౌదరి" పేరుతో నడుస్తున్న ఖాతా నుంచే ఆ ఫేక్ వీడియోలు పోస్టు చేసినట్లు గుర్తించారు. ఆ ఖాతాను వెంటనే బ్లాక్ చేయించగా, వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. పోలీసులు ఐపీ అడ్రెస్లను ట్రేస్ చేస్తుండగా, ఈ వీడియోలు విదేశాల నుంచి అప్లోడ్ అయ్యి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కేసును స్వయంగా సీపీ సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications











