Shraddha Walkar ముక్కలు ముక్కలుగా నరికి చంపుతానన్నాడు.. శ్రద్దా వాకర్ లేఖను బయటపెట్టిన కంగన రనౌత్
ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్దా వాకర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. ప్రియురాలు శ్రద్దాను ముక్కలు ముక్కలుగా కోసి ఢిల్లీకి సమీపంలోని అడవిలో పాతిపెట్టిన విషయం దేశవ్యాప్తంగా ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ క్రూరమైన చర్యను దేశవాసులంతా ఖండిస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం శ్రద్దా ఫిర్యాదు చేసిన లేఖ ప్రస్తుతం మీడియాలో వైరల్ అయింది. ఆ లేఖను బాలీవుడ్ నటి కంగన రనౌత్ షేర్ చేసి ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ లేఖలో శ్రద్దా ఏం రాసింది.. కంగన రనౌత్ ఎలా ఎమోషనల్ అయిందనే విషయంలోకి వెళితే..

డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై
శ్రద్దా వాకర్, ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా ఇద్దరు డేటింగ్ యాప్ ద్వారా కలుసుకొన్నారు. 2019 నుంచి రిలేషన్షిప్ను కొనసాగిస్తున్నారు. అయితే తనను మానసికంగా, శారీరకంగా అఫ్తాబ్ వేధిస్తున్నాడు. దారుణంగా కొడుతున్నాడు. గత ఆరు నెలలుగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు అని మహారాష్ట్రలోని తిలుంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

నా ప్రియుడు చిత్రహింసలు
అఫ్తాబ్ పూనావాలా నన్ను కొడుతున్నాడు. చంపడానికి ప్రయత్నిస్తున్నాడనే విషయం ఆయన తల్లిదండ్రులకు కూడా తెలుసు. మేము సహజీవనం చేస్తున్నామని ఆయన తల్లిదండ్రులకు తెలుసు. వాళ్లు కూడా మా ఇంటికి అప్పుడప్పుడు వస్తుంటారు. అఫ్తాబ్ కుటుంబం ఆశీస్సులతో పెళ్లి కూడా చేసుకొందామని అనుకొన్నాం. అయితే అఫ్తాబ్ తీరు చూసిన తర్వాత అతడిని వదిలేయాలని అనుకొన్నాను. శారీరకంగా హింసిస్తూ.. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని లేఖలో శ్రద్దా వాకర్ పేర్కొన్నది.

ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా..
శ్రద్దా వాకర్ ఇన్స్టాగ్రామ్ లేఖను కంగన రనౌత్ షేర్ చేసి.. 2020లో తనకు ప్రాణహాని ఉందని వేడుకొన్నది. నన్ను ముక్కలు ముక్కలు కోసి చంపుతానని బెదిరించాడని శ్రద్దా ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పోలీసులకు తెలిపింది. అమాయకురాలైన శ్రద్దాకు మాయమాటలు చెప్పి.. ఢిల్లీకి తీసుకెళ్లి కోరికలు తీర్చుకొన్నాడు అని కంగన రనౌత్ ఆవేదన వ్యక్తం చేసింది.

దుర్మార్గుడిని నమ్మి... అలా
మహిళ అంటే.. నవమాసాలు గర్బాన్ని మోసి బిడ్డకు జన్మనిచ్చి ఈ భూమ్మీదకు పంపుతుంది. తనను ఇష్టపడినా.. ఇష్టపడకపోయినా.. ఎలాంటి విచక్షణ లేకుండా ప్రేమను పంచుతుంది. ప్రపంచం నుంచి ప్రేమను పొందాలని కోరుకొంటున్నది. అయితే శ్రద్ద విషయానికి వస్తే.. తనకు హీరోగా అనిపించిన వ్యక్తి దుర్మార్గుడైనా న్యాయం జరుగుతుందని భావించింది. కానీ ఫలితం వేరేలా కనిపించింది. తనకు అన్యాయం చేసిన దేవుళ్లపై పోరాటం చేయడానికి ఈ లోకం నుంచి వెళ్లిపోయిందేమో అని కంగన రనౌత్ ఆవేదన వ్యక్తం చేసింది.

శ్రద్దా వాకర్ ప్రియుడి నార్కోటెస్ట్ వాయిదా
శ్రద్దా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ పూనావాలాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా వాస్తవాలు బయటకు లాగేందుకు పాలిగ్రాఫ్ టెస్ట్ను నిర్వహించేందుకు సిద్దమయ్యారు. అయితే అఫ్తాబ్ అనారోగ్యానికి గురి కావడంతో నార్కోటెస్ట్ను వాయిదా వేశారు అని ఢిల్లీ లా అండ్ ఆర్డర్ అధికారి సాగర్ ప్రీత్ హుడా తెలిపారు.


Click it and Unblock the Notifications











