Bappi Lahiri కి కన్నీటి వీడ్కోలు.. డిస్కో కింగ్ మరణానికి కారణం చెప్పిన అల్లుడు.. అంత్యక్రియలు ఆలస్యం ఎందుకంటే?
దేశ సినీ పరిశ్రమలో 80, 90వ దశకంలో డిస్కో మ్యూజిక్తో యువతను, పెద్దలను ఉర్రూతలూగించిన డిస్కో కింగ్ బప్పీ లహిరి ఇక లేరనే వార్త సంగీత ప్రపంచాన్ని, అభిమానులను దిగ్బ్రాంతికి గురిచేసింది. బప్పీ దా మరణంతో సినీ ప్రముఖులు తల్లడిల్లిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. అయితే బప్పీ లహిరి మరణం వెనుక అసలు విషయాన్ని ఆయన కుమారుడు భావోద్వేగంతో పంచుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ముంబై విల్లే పార్లే శ్మశాన వాటికలో..
గత నెల రోజులుగా ముంబై క్రిటికేర్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి బప్పీ లహిరి మరణించారు. ఆయన అంత్యక్రియలు ముంబైలోని విలే పార్లే శ్మశాన వాటికలో అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు విషాదఛాయల మధ్య ముగిసాయి. తమ అభిమాన సంగీత దర్శకుడికి కన్నీటితో వీడ్కోలు తెలిపారు.

తరలి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు
గురువారం ఉదయం (ఫిబ్రవరి 17న) విల్లే పార్లే శ్మశాన వాటికలో జరిగిన అంత్యక్రియలకు బాలీవుడ్ సినీ ప్రముఖులు తరలివచ్చారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో అక్కా యాగ్నిక్, శక్తి కపూర్, రూపా గంగూలీ, విద్యా బాలన్, భూషణ్ కుమార్, మికా సింగ్, అభిజిత్ భట్టాచార్య తదితరులు ఉన్నారు.

బప్పీ లహిరికి గుండె పోటు
బప్పీ లహిరి మరణం గురించి ఆయన అల్లుడు గోవింగ్ భన్సాల్ మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. మూడు వారాల తర్వాత బప్పీ లహిరి హాస్పిటల్ నుంచి ఇంటికి సోమవారం వచ్చారు. మంగళవారం రాత్రి 8.30 నుంచి 9 మధ్య డిన్నర్ పూర్తి చేశారు. డిన్నర్ పూర్తి అయిన తర్వాత అర్ధగంటకు బప్పీ దాకు గుండె పోటు వచ్చింది. వెంటనే పల్స్ రేట్ పడిపోయాయి. వెంటనే హాస్పిటల్కు తరలించాం అని గోవింద్ భన్సాల్ తెలిపారు.

వైద్యులు ప్రయత్నం చేసినప్పటికీ..
బప్పీ లహిరిని క్రిటికేర్ హస్పిటల్కు తరలించిన తర్వాత వైద్యులు శతవిధాల ప్రయత్నించారు. పడిపోయిన పల్స్ రేట్ను తిరిగి నార్మల్గా తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేశారు. అయితే వైద్యులు ప్రయత్నాలు సఫలం కాలేదు. మంగళవారం అర్ధరాత్రి 11.45 గంటలకు తుదిశ్వాస విడిచారు అంటూ అల్లుడు గోవింద్ భన్సాల్ భోరుమని విలపించారు.

అమెరికా నుంచి కుమారుడు రాకతో..
బప్పీ లహిరి కన్నుమూసిన సమయంలో ఆయన కుమారుడు బప్పా లహిరి అమెరికాలో ఉన్నారు. ఆయన రావడానికి ఆలస్యం కావడం జరిగింది. బప్పా లహిరి గురువారం ఉదయం ముంబైకి చేరుకోవడంతో ఒకరోజు తర్వాత విల్లే పార్లే శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించాం అని గోవింద్ భన్సాల్ తెలిపారు.


Click it and Unblock the Notifications











