Shahrukh Khan Pathaan సినిమాకు సెన్సార్ బోర్డ్ మొట్టికాయలు.. ఆ సన్నివేశాలకు కత్తెర!
షారుక్ ఖాన్ పఠాన్ చిత్రానికి మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చేసిన బేషారమ్ రంగ్ సాంగ్ చుట్టూ వివాదాలు వ్యాపించాయి. ఈ పాటకు భారీగా స్పందన లభించినప్పటికీ అంతకు మించిన రేంజ్ లో విమర్శలు వెల్లు వెత్తిన విషయం తెలిసిందే. రాజకీయం నుంచి మతాల వారీగా బేషారమ్ రంగ్ పాటను విమర్శించగా.. వాటిపై సినిమా బృందం ఇప్పటివరకు స్పందించలేదు. కానీ సర్టిఫికేషన్ కోసం సెన్సార్ బోర్డ్ ముందు సినిమాను ఉంచిన మేకర్స్ కు మొట్టికాయలు వేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

చాలా కాలం తర్వాత..
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, బ్యూటిఫుల్ దీపిక పదుకొణె మరోసారి జంటగా నటించిన చిత్రం పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ యష్ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రంలో హీరో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా అతిధి పాత్రలో మెరవనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాపై ముందు నుంచే అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత షారుక్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.

విడుదల చేయడం ఆపాలి..
అందుకు తగినట్లుగానే పఠాన్ షూటింగ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక పఠాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ బేషరమ్ రంగ్ పాటను డిసెంబర్ 12వ విడుదల చేసిన విషయం తెలిసిందే. షారుక్, దీపికల హాట్ నెస్ తో బేషరమ్ రంగ్ సాంగ్ ఎంత క్రేజ్ తెచ్చుకుందో అంతే విమర్శల పాలయింది. ఇందులో దీపికా కాషాయ రంగు బికినీ ధరించడంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రాతోపాటు పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలాగే సినిమాను విడుదల చేయడం ఆపాలని డిమాండ్ కూడా చేశారు. ఈ సినిమా పాటలో కాషాయం రంగులో బికినీని ధరించి అవమానపరిచే విధంగా చేశారు అని నిరసనలు వ్యక్తమయ్యాయి. సినిమాలోని పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదు చేశారు.

ఆ సీన్లు తొలగించాలి..
అయితే ఈ విమర్శలపై పఠాన్ మూవీ మేకర్స్ ఏమాత్రం రియాక్ట్ కాలేదు. కానీ ఇటీవల ఓ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన షారుక్ ఖాన్ మాత్రం అలా విమర్శించే వాళ్లు సంకుచిత స్వభావులు అని ఇండైరెక్ట్ గా కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ పఠాన్ సినిమా సెన్సార్ బోర్డ్ కు వెళ్లింది. బేషరమ్ రంగ్ సాంగ్ లో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అలానే చిత్రంలో కూడా పలు సీన్లను తీసివేయాలని సెన్సార్ బోర్డ్ ఆదేశించింది. పలు సన్నివేశాలను కత్తిరించాలని లేదా మార్పులు చేయాలని సూచించింది సెన్సార్ బోర్డ్. దీంతో పఠాన్ మూవీ మేకర్స్ కు షాక్ తగిలినట్లయింది. సెన్సార్ బోర్డ్ ఆదేశంతో సినిమాలో దిద్దుబాటు చర్యలకు పఠాన్ చిత్ర బృందం దిగినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











