ఇర్ఫాన్ ఖాన్ బ్రతికేది కొద్ది రోజులే అంటూ వార్తలు, మీడియా ప్రతినిధి వివరణ!
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొన్నిరోజుల క్రితం అరుదైన వ్యాధితో ఆసుపత్రితో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్లో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుండి ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం మీద రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
గతంలో బ్రెయిన్ ట్యూమర్ సోకిందనే వార్తలు ప్రచారంలోకి రాగా స్వయంగా ఇర్ఫాన్ ఖాన్ ఈ విషయమై స్పందిస్తూ తాను అరుదైన న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ బారిన పడ్డానని, ఇది బ్రెయిన్కు సంబంధించిన ట్యూమర్ కాదని వెల్లడించారు. ఇది చాలా అరుదైన వ్యాధి అని, దీన్ని అధ్యయం చేయడం వైద్యులకు సైతం క్లిష్టంగా ఉందని, దీన్ని జయించే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని ఆయన తెలిపారు.

బ్రతికేది కొద్ది రోజులే అంటూ రూమర్స్
కాగా, తాజాగా ఇర్ఫాన్ ఖాన్ గురించి మరోసారి షాకింగ్ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఆయనకు సోకిన క్యాన్సర్ చివరి దశలో ఉందని, ఇక బ్రతికేది కొద్ది రోజులే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఇర్ఫాన్ ఖాన్ ప్రతినిధి స్పందించారు.

ఆ వార్తల్లో నిజం లేదు
ఇర్ఫాన్ ఖాన్ గురించి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న వార్తలన్నీ అవాస్తవమని, ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా ఇలాంటి పుకార్లను ప్రచురించ వద్దని ఆయన మీడియాను కోరారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసి ఆయన కుటుంబ సభ్యులను బాధ పెట్టవద్దన్నారు.

ఇర్ఫాన్ త్వరగా కోలుకోవాలి
కాగా, ఇర్ఫాన్ ఖాన్ త్వరగా కోలు కోవాలని ఆయన అభిమానులు, బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కోరుకుంటోంది. తనకు సోకిన అరుదైన వ్యాధిని జయించి మళ్లీ సినిమాలు చేస్తూ అభిమానులను ఎంటర్టెన్ చేయాలని కోరుకుంటున్నారు.

అరుదైన, క్లిష్టమైన వ్యాధి
న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ లక్షణాలు అంత త్వరగా బయట పడవని, ఒక్కోసారి వేగంగా, ఒక్కోసారి నెమ్మదిగా ఇది విస్తరిస్తుందని, దీని తీరును అంచనా వేయడం వైద్యలకు కూడా కష్టంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కీమోథెరపీ ద్వారా ఇర్ఫాన్కు ఈ కణితి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఆయన తిరిగి వస్తేనే ఆ సినిమా పూర్తయ్యేది
ప్రస్తుతం ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో విశాల్ భరద్వాజ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో దీపిక పదుకోన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇర్ఫాన్ ఖాన్ అరుదైన వ్యాధి బారిన పడటంతో ఈ షూటింగ్ ఆగిపోయింది. ఆయన పూర్తిగా కోలుకుని ఇండియా వస్తే తప్ప ఈ సినిమా పూర్తయ్యే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications











