Sushant Singh Rajput Death Anniversary: మిస్టరీగా సుశాంత్ మరణం.. న్యాయం కావాలి అంటూ నెటిజన్ల డిమాండ్
ప్రపంచ సినీ అభిమానులను తీవ్ర విషాదంలోకి నెడుతూ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ లోకాన్ని వీడి సరిగ్గా ఏడాది పూర్తయింది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత నెలకొన్న అనేక చిక్కుముడులు ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మిస్టరీగా మారిన సుశాంత్ మరణం వెనుక అసలు కారణాలను పరిశోధించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్, సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ మరణించిన తర్వాత తెరపైకి వచ్చిన వివాదాస్పద అంశాలు మీ కోసం..
Recommended Video

హడావిడిగా పోస్టుమార్టం, అంత్యక్రియలు
సుశాంత్ సింగ్ మరణం తర్వాత ముంబైలో హడావిడిగా పోస్టుమార్టం చేయించడం, అలాగే అంత్యక్రియలు పూర్తి చేయడం అనేక అనుమానాలకు దారి తీసింది. సుశాంత్ మరణంపై అనేక సందేహాలను సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. సుశాంత్ సింగ్ ఉరి వేసుకొన్న గదికి సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ అతడిది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ నెటిజన్లు సంచలన ఆరోపణలు చేశారు.

ముంబై పోలీసుల దర్యాప్తుపై అనుమానం
సుశాంత్ సింగ్ మృతి కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు తీరు అనేక అనుమానాలకు దారి తీశాయి. సుశాంత్ మరణం కేసులో రియా చక్రవర్తిపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దాంతో సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం మరింత సంచలనం రేపింది. దీంతో ఈ కేసులోకి ఈడీ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.

రియా చక్రవర్తి అరెస్ట్తో సంచలనం
సుశాంత్ బ్యాంక్ అకౌంట్లలో అవకతవకలు జరిగాయని ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడిపై కేకే సింగ్ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత సుశాంత్ మరణానికి డ్రగ్స్ మాఫియా కారణమనే అనుమానంతో ఎన్సీబీ రంగంలోకి దిగింది. ఆ తర్వాత రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తిని విచారించడం ఆ తర్వాత వారిద్దరిని అరెస్ట్ చేయడం మరో సంచలనం రేపింది. అరెస్ట్ అనంతరం నెల రోజుల తర్వాత రియా, షోవిక్ బెయిల్పై విడుదలవ్వడం తెలిసిందే.

అనేక మలుపుతో సుశాంత్ మరణం కేసు
సుశాంత్ సింగ్ మరణం కేసు జూన్ 14, 2020 నుంచి అనేక మలుపులు తిరుగుతూ వస్తున్నది. సుశాంత్ మరణానికి ముంబైలో జరిగిన ఓ సినీ సెలబ్రిటీ బర్త్ డే వేడుక అసలు కారణమని.. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ప్రమేయం ఉందనే ఆరోపణలు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ముంబైలోని అనేక మంది డ్రగ్స్ సరఫరాదారులను, సుశాంత్ సింగ్ స్నేహితుడు సిద్ధార్థ్ పితాని, పని మనుషులను ఎన్సీబీ విచారించడమే కాకుండా అరెస్టులు కూడా చేసింది.

ట్విట్టర్లో ట్రెండింగ్
సుశాంత్ సింగ్ మరణం కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో మరింత సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో బయటకు వస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు మిగిలే ఉన్నాయి. సుశాంత్ సింగ్ మరణించి ఏడాది పూర్తి అవ్వడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మరోసారి తమ అనుమానాలను వ్యక్తం చేస్తూ న్యాయం కావాలి అని డిమాండ్ చేస్తూ Sushant Singh Rajput హ్యాష్ ట్యాగ్ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











