ఇరవై ట్రైలర్స్ తో నాగార్జున భారీ పబ్లిసిటీ ప్లాన్
హైదరాబాద్ : ఎంతోమందికి సినీ జీవితాన్ని ప్రసాదించిన 'శివ' సినిమా గత యేడాది అక్టోబర్ 5తో పాతికేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘శివ' సినిమాని రీ రిలీజ్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం రీరిలీజ్ కు పబ్లిసిటీ ఓ రేంజిలో చేయాలని నాగార్జున ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇందుకోసం ఇరవై ట్రైలర్స్ వదులుతున్నట్లు తెలుస్తోంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శివ...మే 15న విడుదల చేస్తున్నామని ఆ ట్రైలర్స్ లో ప్రముఖంగా ఉండనుంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున, అమల జంటగా తెరకెక్కిన సినిమా 'శివ'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయం అయిన ఈ మూవీ 1989 అక్టోబర్ 5న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియెన్స్ ముందుకొచ్చిన 'శివ' అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది.

ఈ సినిమా రీమాస్టర్ ప్రింట్ చేయడానికి సుమారు నాలుగు నుంచి ఐదు కోట్లు ఖర్చు పెట్టారని ఫిలింనగర్ సమాచారం. ఇప్పుడున్న టెక్నాలజీకి అణుగుణంగా ఈ చిత్రాన్ని డిజిటలైజేషన్ చేసి రీ మాస్టర్ ప్రింట్తో విడుదల చేస్తున్నారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం మే 15న విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.
వర్మ 'ఎక్స్ ప్లోరింగ్ శివ ఆఫ్టర్ 25 ఇయర్స్' పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించగా, నాగార్జున 'శివ' టీమ్ మొత్తాన్నీ ఓ వేదిక మీదకు తీసుకొచ్చారు. అంతేకాదు... త్వరలోనే 'శివ' చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తామని ఆ స్టేజ్ పై ప్రకటించారు. అయితే అది కార్యరూపం దాల్చడం కాస్తంత ఆలస్యమైంది. పాత సినిమాల మాస్టర్ ప్రింట్స్ ను డిజిటల్ ఫార్మాట్ లోకి మార్చి ప్రస్తుతం చాలామంది భద్రపరుస్తున్నారు.
అయితే యథాతథంగా డిజిటల్ ఫార్మాట్లోకి మార్చితే... ఆ గీతాలు, మరకలు అలానే ఉంటాయి. అలా కాకుండా 'శివ' మాస్టర్ ప్రింట్ ను ముంబైలో లేటెస్ట్ టెక్నాలజీసాయంతో రీ మాస్టర్ ప్రింట్ చేయించారు నిర్మాత నాగార్జున. మెరుగైనా సౌండ్ అండ్ కలర్ కాంబినేషన్ లో ఖర్చుకు వెనకాడకుండా రీ మాస్టర్ ప్రింట్ ను డిజిటలైజ్ చేశారు. దీనిని వేసవి కానుకగా మే 15న భారీ ఎత్తున విడుదల చేయాలన్నది నాగార్జున ఆలోచన.
నాగార్జున మాట్లాడుతూ... నా జీవితాన్ని మార్చిన సినిమా శివ. జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. కాని, బాధపడను. ఎందుకంటే ‘శివ' అనే సినిమాలో నటించి, నిర్మించి ఒక కరెక్ట్ పని చేశాను. ఈ సినిమాను తిరిగి విడుదల చేస్తున్నాం. డిజిటల్ రీమాస్టర్ ప్రింట్ తో సుమారు 100 థియేటర్లలో ‘శివ' సినిమాను ప్రదర్శిస్తాం అని నాగార్జున అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ..' వర్మ ఒక సెల్యూలాయిడ్ సైంటిస్ట్. ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు ఉంటాయి. కానీ అక్కడ మనలాంటి మనుషులే ఉంటారని చిన్నప్పుడు అనుకునే వాడిని. అలాంటి నక్షత్రాల్లోంచి ఊడిపడిన వ్యక్తే వర్మ. అప్పట్లో వర్మ తండ్రి రాజు అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేశారు. అయన మా అబ్బాయి కథ చెబుతాడని నా వద్దకు వచ్చారు.
మొదట 'రాత్రి' అనే కథ చెప్పాడు. అలాంటి కథలు మన వాళ్లు చూడరు. హీరోయిజం ఉన్న కథ చెప్పమని అడిగితే.. కొద్ది రోజుల్లోనే 'శివ' కథ చెప్పాడు. అందులో ఏదో కొత్తదనం అనిపించింది. సినీ లైఫ్నే కాకుండా, నా వ్యక్తిగత జీవితాన్ని కూడా మార్చిన సినిమా శివ. శివ సినిమాల్లోని అన్ని విభాగాలు కొత్తగా మార్పులు చేసి విడుదల చేస్తున్నాము.' అని అన్నారు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... శివ సినిమాతో అందరూ నేను రూల్స్ బ్రేక్ చేసానని అంటూంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే అప్పటికి నాకు అస్సలు రూల్స్ అనేవే తెలియదు. అందుకే ఆ చిత్రం ట్రెడ్ సృష్టించింది. ఇప్పటికీ, ఎప్పటికీ నేను చెప్పేది ఒకటే శివ కేవలం నాగార్జున వల్లే సాధ్యమైంది అన్నారు.


Click it and Unblock the Notifications











