twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వరూపం'కు రూ.30 కోట్లు నష్టం

    By Srikanya
    |

    చెన్నై : హీరో గా నటిస్తూ కమల్‌హాసన్ రూపొందించిన 'విశ్వరూపం' విడుదల కాకుండా తమిళనాడు ప్రభుత్వం విధించిన నిషేధం కారణంగా ఆ చిత్రానికి దాదాపు రూ. 30 కోట్ల నష్టం వాటిల్లినట్లు ట్రేడ్ లో అంచనా . ముస్లింలకు వ్యతిరేకంగా ఈ సినిమాలో సన్నివేశాలున్నాయంటూ కొన్ని ముస్లిం సంస్థలు చేసిన ఆందోళన ఫలితంగా తమిళనాడులో ఈ సినిమాకి అక్కడి ప్రభుత్వం రెడ్ సిగ్నల్ వేసిన సంగతి తెలిసిందే. రూ. 95 కోట్ల భారీ బడ్జెట్‌తో తయారైన 'విశ్వరూపం'కు ఇది పెద్ద దెబ్బ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాట విడుదల ఇంకా ఆలస్యమైతే ఈ నష్టం రూ. 30 కోట్లు దాటుతుందని నిపుణులు చెబుతున్నారు.

    కమల్‌హాసన్‌ 'విశ్వరూపం' చిత్రంపై తమిళనాట ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని 26న వీక్షించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.వెంకట్రామన్‌ కేసును సోమవారం విచారించారు. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ ''దేశంలో శాంతిభద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకోవాలి. దేశ ఐక్యత, రెండు వర్గాల మధ్య ఉన్న సామరస్యానికి భంగం వాటిల్లకూడదు. ఈ విషయాన్ని ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాల''ని సూచించారు. ఆయన తన తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నది న్యాయమూర్తి పరిశీలన మాత్రమే, దానిని తీర్పుగా భావించాల్సిన అవసరం లేదని కమల్‌హాసన్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

    వారాంతపు సెలవు రోజుల్లో చిత్రం నిషేధానికి గురి కావటంతో రూ.30 నుంచి 80 కోట్ల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని కమల్‌ సోదరుడు చంద్రహాసన్‌ పేర్కొన్నారు. సినిమా ప్రదర్శనకు అనుమతించినా ప్రస్తుతం థియేటర్ల లభ్యత, వారం మధ్యలో చిత్రాన్ని ప్రదర్శించేందుకు థియేటర్‌ యాజమానుల సంసిద్ధతపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఏ వర్గం మనోభావాలు కూడా దెబ్బ తినకుండా చిత్ర నిర్మాణ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించామని చంద్రహాసన్‌ కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

    ఒక పెద్ద స్టార్ సినిమా నిషేధానికి గురైతే నష్టాలు భారీగా ఉంటాయని డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించడంతో చాలా థియేటర్లలో 22 నుంచే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టిక్కెట్లు అమ్మారు. అయితే నిషేధం వల్ల వాటిని తిరిగి ఇచ్చేసి, ఆ థియేటర్లలో తిరిగి మునుపటి సినిమాల్నే ప్రదర్శిస్తున్నారు. సోమవారం వరకు నిషేధం విధించగా, తాజాగా దీనిపై మంగళవారం కూడా వాదనల్ని వినాలని మద్రాస్ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో 29 కూడా ఈ సినిమా విడుదలకు తమిళనాట ఆస్కారం లేకుండా పోయింది.

    English summary
    Kamal has incurred a huge loss up to Rs 30 cr due to the ban on Viswaroopam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X