‘బలుపు’కలెక్షన్స్ ఆ రేంజిలోనా?
హైదరాబాద్: రవితేజ నటించిన 'బలుపు' చిత్రం క్రితం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న రవితేజకు ఈ చిత్రం ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 15 కోట్ల వరకూ కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అలాగే ఓవర్ సీస్ లోనూ ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తోందని చెప్తున్నారు. కలెక్షన్స్ స్టడిగా ఉండటంతో అందరూ హ్యాపీగా ఉన్నారు.
రవితేజ అభిమానులు కూడా చాలా కాలం తర్వాత తాము కోరుకుంటున్నట్లుగా రవితేజను తెరపై చూసి హ్యాపీగా ఫీలయ్యారు. 'బలుపు'చిత్రం తొలి రోజు టోటల్గా దాదాపు రూ. 6 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఒక ఆంధ్రప్రదేశ్లోనే రూ.3.9 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కచ్చితమైన లెక్కల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. రవితేజ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో కాస్త భయపడుతూనే సినిమాను కొన్న బయ్యర్లు తాజా ఫలితాలతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నిర్మాత మాట్లాడుతూ...''రవితేజతో నాది 20 ఏళ్ల నాటి అనుబంధం. విజయవాడలో మా కెరీర్ మొదలైంది. తాను సినీ పరిశ్రమకు వచ్చి హీరో అయ్యాడు. నేను వ్యాపారరంగంలోకి వెళ్లి ఈ స్థాయికి చేరాను. తెలుగులో తొలి సినిమా అంటూ చేస్తే రవితేజతోనే చేయాలని అనుకునేవాణ్ణి. సరైన కథ కోసం ఎదురు చూస్తున్న సమయంలో దర్శకుడు మలినేని గోపీచంద్ ఈ కథ చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో రవితేజతో చేయాలంటే ఇలాంటి సినిమానే చేయాలనిపించింది.అందుకే వెంటనే నిర్మాణానికి పూను కున్నాను'' అని నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి అన్నారు.
రవితేజ మాట్లాడుతూ... ''మాటల్లో వ్యక్తం చేయలేనంత సంతోషంగా ఉన్నాన్నేను. ఈ విజయానికి ప్రధాన కారకుడు పీవీపీ. తెలుగులో తాను నిర్మించిన తొలి సినిమా హిట్ అవ్వడం ఆనందంగా ఉంది. దర్శకునిగా గోపి మరో మెట్టు ఎక్కాడు''అని రవితేజ చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ -'' 'బలుపు'కు ముందు రవితేజ నటించిన రెండుమూడు సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. ఆయనకు విజయం రావాలని నాలాంటి దర్శకులు చాలామంది కోరుకున్నారు. ఎందుకంటే ఆయనకు సక్సెస్ వస్తే నా లాంటి ఎందరో దర్శకులకు దారి చూపిస్తారాయన'' అన్నారు. తనకు తెలుగులో మరో విజయాన్ని అందించిన 'బలుపు' చిత్రం యూనిట్కి అంజలి కృతజ్ఞతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











