ఆశ్చర్యపరిచే న్యూస్ :ఈ నెల్లోనే మోహన్ లాల్ రెండు పెద్ద హిట్స్ తెలుగులో
వచ్చే డిసెంబర్ లో మోహన్ లాల్ చిత్రాలు రెండు రిలీజ్ కానున్నాయి. అందులో ఒకటి మన్యం పులి, రెండోది ‘ఒప్పం’ డబ్బింగ్. ఈ రెండు చిత్రాలు మళయాళంలో పెద్ద హిట్టైనవే కావటం గమనార్హం.
హైదరాబాద్ : ఒక చోట హిట్టైన సినిమాలు రీమేక్ చేయటం, డబ్బింగ్ చేయటం పెద్ద విశేషమేమీ కాదు. అలాగే తెలుగులో ఇప్పటికే రకరకాల భాషల నుంచి అనేక డబ్బింగ్ సినిమాలు వచ్చి రిలీజయ్యి..విజయవంతమయ్యాయి. అయితే ఒకే నెలలో ఒక హీరోకు చెందిన రెండు డబ్బింగ్ సినిమాలు మాత్రం ఆశ్చర్యమనిపిస్తుంది.
ఆ రెండు చిత్రాలే...మోహన్ లాల్ పెద్ద హిట్ అయిన పులిమురగన్ డబ్బింగ్ ..మన్యం పులి. మరో మోహన్ లాల్ హిట్ ..ఒప్పం డబ్బింగ్. ఈ రెండు చిత్రాలు డిసెంబర్ నెలలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమచారం.
ముందుగా మన్యం పులి విషయానికి వస్తే...ఈ చిత్రాన్ని డిసెంబర్ 2 న విడుదల చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ విషయమై క్లారిటీ ఇస్తూ ఈ రోజు ప్రకటన వచ్చే అవకాసం ఉంది. మళయాళంలో పెద్ద హిట్టైన ఈ చిత్రం తెలుగులోనూ అంతకు మించి అన్నట్లుగా రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ రైట్స్ తీసుకున్న తెలుగు నిర్మాత సింధూరపు పువ్వు కృష్ణారెడ్డి.

స్టైయిట్ తెలుగు సినిమా రీతిలో ఈ చిత్రాన్ని విడుదల చేసి, హిట్ కొట్టేందుకు సన్నాహం అవుతున్నారు. పక్కా మాస్ మసాలా సినిమా కావటంతో ఈ సినిమా తెలుగు వెర్షన్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అది సంచలన విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
మరో ప్రక్క మోహన్ లాల్ , సముతిరాకని, అనుశ్రీ, విమలారామన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఒప్పం'. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది రిలీజైన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం మొదటి 15 రోజుల్లోనే 23.7 కోట్లు గ్రాస్ వసూలు చేసి , మళయాళ సూపర్ హిట్ మూవి ప్రేమమ్ రికార్డ్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది.
ఈ చిత్రం తమిళ రీమేక్ ని కమల్, హిందీలో అక్షయ్ చేయటానికి ఆసక్తిచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో ప్రక్క ఈ చిత్రం బెంగాళి రైట్స్ ని ఓ కార్పోరేట్ సంస్ద చేజిక్కించుకోగా, కన్నడ రైట్స్ ని కూడా అమ్ముడుపోయినట్లు సమాచారం. కన్నడంలో ఓ తెలుగు దర్శకుడు ఈ రీమేక్ చేస్తాడని వినపడుతోంది.

ఇక తెలుగు విషయానికి వస్తే... ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ కోసం వెంకటేష్ వంటి హీరోలు,సాయి కొర్రపాటి వంటి స్టార్ నిర్మాతలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్టైన్మెంట్స్ బి.దిలీప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు ఈ చిత్రం రీమేక్ చేయటానికి ఆసక్తి చూపెడుతున్నా..మోహన్ లాల్ మాత్రం రైట్స్ ఇవ్వటానికి పెద్దగా ఆసక్తి చూడటం లేదని వినికిడి. జనతాగ్యారేజ్, మనమంతా సినిమాలతో తనకు తెలుగులో ఏర్పడ్డ మార్కెట్ తో ఈ సినిమాని ఇక్కడ బిజినెస్ చేసి విడుదల చేయాలనకుంటున్నారు.
అలాగే మోహన్ లాల్ స్వయంగా తను నటించిన వెర్షన్ తోనే తెలుగులో కనిపించాలనికుంటున్నట్లు చెప్తున్నారు. రీమేక్ చేస్తే వేరే హీరోకు ఆ హిట్ ఖాతాలో పడుతుంది. అదే తన డబ్బింగ్ సినిమా ఆడితే, తనకు పేరు , డబ్బు, ఇక్కడ మరిన్ని ఆఫర్స్ తో పాటు, తెలుగులోనూ ఆయన పాగా వేయటానికి కుదురుతుంది. దాంతో ఆయన, ఇక్కడ తెలుగు లో మరో నిర్మాతతో పాటు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కు ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో మోహన్ లాల్.. జయరామన్ అనే పాత్రలో అంధుడిగా కనిపించారు. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కి విజయవంతమైన ఈ చిత్రం తెలుగువారికీ నచ్చుతుందని భావిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు చిత్రం ఘన విజయం సాధించింది. ఆయన్ను రీమేక్ కోసం చాలా మంది అడిగినా నో చెప్పి రిలీజ్ చేసి, తెలుగులోనూ పెద్ద హిట్ కొట్టారు. తెలుగులోనూ ఇప్పుడు ఆయన ప్రతీ సినిమాకూ ఇక్కడ మార్కెట్ మొదలైంది. చూస్తూంటే మోహన్ లాల్ అదే స్కూల్ లో వెళ్తున్నట్లున్నారు.


Click it and Unblock the Notifications











