హాట్ టాపిక్ : మోహన్ బాబు..30 కోట్లు రిస్క్
హైదరాబాద్ : మోహన్ బాబు పెద్ద రిస్క్ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు. . ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద'. ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రానికి బిజినెస్ కాలేదు. స్టార్ కాస్ట్, బడ్జెట్ పెరగటంతో ముప్పై కోట్లు వరకూ బడ్జెట్ అయ్యిందని ఆయన చెప్తున్నారు. అయితే ఆయనకు కేవలం ఇరవై కోట్ల వరకే బిజినెస్ ఆఫర్స్ వచ్చాయని, దాంతో ఆయన వాటిని వదులుకుని సొంతంగా రిలీజ్ చేయటానికి ముందుకొచ్చారని తెలుస్తోంది. ఆయన బ్యానర్ నుంచి వస్తున్న చిత్రాలు, ఆయన కుమారుల చిత్రాలు ఈ మధ్య కాలంలో పెద్దగా హిట్ కావటం లేదు. ఈ నేపధ్యంలో ఇలా సొంతంగా రిలీజ్ చేయాలనుకోవటం పెద్ద రిస్క్ అని ట్రేడ్ లో అంటున్నారు.
మోహన్ బాబు మాట్లాడుతూ... ''కథ, నటీనటులు... వీటి మీద నమ్మకంతో నేను సినిమాలు చేస్తూ వచ్చాను. నటుడిగా అయినా నిర్మాతగా అయినా నా పద్ధతి ఇదే. ఇలాగే ఆ రోజుల్లో 'పెదరాయుడు' సినిమాని చేశాను. కానీ ఆ సినిమా మీద నమ్మకం లేక విడుదల చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నేనే సొంతంగా విడుదల చేశాను. ఇప్పుడు 'పాండవులు పాండవులు తుమ్మెద'ని రూ.30 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించాం. ఈ సినిమాని పంపిణీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నేను సొంతంగా రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేస్తున్నాను. అప్పుడు 'పెదరాయుడు' ఎలా విజయం సాధించిందో... ఈ సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుంది'' అన్నారు మోహన్బాబు.

అలాగే ...''నేను పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో నటించి పదేళ్లవుతోంది. నా కొడుకులు హీరోలుగా మంచి స్థానంలోకి వచ్చారు. ముగ్గురం కలసి నటిద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కథ కోసం ఇన్నాళ్లు ఆగాం. 'రావణ' చేద్దామనుకుంటే దానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా చేశాం. మేం అనుకున్నట్లుగా సినిమా చక్కగా వచ్చింది. రవి, కోనవెంకట్, బీవీఎస్రవి, గోపీమోహన్ చక్కటి కథని సిద్ధం చేశారు. దాన్ని శ్రీవాస్ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మంచు విష్ణు, మనోజ్, వరుణ్సందేశ్, తనీష్, రవీనాటాండన్, హన్సిక, ప్రణీత తమ పాత్రలమేరకు చక్కటి ప్రతిభకనబర్చారు. ఇంటిల్లిపాది చూసే సినిమాగా నిలుస్తుంది.' అన్నారు.
చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... నా పాత్ర పేరు నాయుడు. నా పాత్ర నోటికి దురుసు ఎక్కువ. చేతికి దురదెక్కువ. సినిమాలో విష్ణు రఫ్ అండ్ టఫ్గా కనిపిస్తాడు. మనోజ్ స్త్రీ పాత్రలో కనిపిస్తాడు. బృహన్నలగా ఎన్టీఆర్గారికి ఎంత పేరు వచ్చిందో ఇందులో మోహినిగా మనోజ్కి అంతటి పేరు వస్తుంది. సినిమా ద్వితీయార్ధంలో మనోజ్ మోహినిగా విజృంభిస్తాడు. ఇప్పటివరకూ నా జీవితంలో నటించని పాత్ర ఇది. మా పాత్రల చిత్రణ హిందీలో వచ్చిన 'గోల్మాల్3'కి దగ్గరగా ఉన్నాయని కొందరు అంటున్నారు. కానీ రెండింటికీ సంబంధం లేదు అని తేల్చి చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.


Click it and Unblock the Notifications











