3.5 కోట్లు బడ్జెట్...ఆరున్నర కోట్లు శాటిలైట్ రైట్స్
హైదరాబాద్ : కేవలం మూడున్నర కోట్లు పెట్టుబడితో సినిమా తీస్తే...ఆ సినిమాకు శాటిలైట్ రైట్స్ ఆరున్నర కోట్లు రావటం అనేది మామూలు విషయం కాదు. మళయాళ సూపర్ హిట్ 'దృశ్యం' విషయంలో అది జరిగింది. అక్కడ లీడింగ్ ఛానెల్ ఏషియా నెట్ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ రేటు రావటం మళయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద రికార్డ్. మోహన్లాల్, మీనా జంటగా నటించిన ఈ చిత్రం అక్కడ పెద్ద విజయం సాధించింది. మరో ప్రక్క రిలీజైన మూడు వారాలకే 15 కోట్లు కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇస్తోంది. మోహన్ లాల్ స్వంత బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లోనూ రీమేక్ అవబోతోంది.

ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి కమల్ ఆసక్తి చూపుతున్నాడు. తెలుగులో వెంకటేష్ ఈ చిత్రం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీప్రియ దర్శకత్వంలో చిత్రం రూపొందనుంది. హీరోయిన్ మిగతా విషయాలు తేలాల్సి ఉంది. ఇక తమిళ వెర్షన్ లో మీనా నే హీరోయిన్ గా తీసుకోనున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో మీనా దశ తిరుగుతున్నట్టు కనిపిస్తోంది .
ఇక వెంకటేష్ సాధించిన విజయాల్లో రీమేక్ చిత్రాల పాత్రే ఎక్కువ. పరభాషల్లో విజయవంతమైన చిత్రాలను ఎంచుకొని వాటిల్లో ఒదిగిపోయే ప్రయత్నం చేస్తుంటారు. ఆ కోవలో తాజాగా మరో ప్రయత్నం చేస్తున్నారు వెంకీ. మలయాళంలో ఆదరణ పొందిన 'దృశ్యం' తెలుగు పునర్నిర్మాణ హక్కుల్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సొంతం చేసుకొంది. రాజ్కుమార్ థియేటర్స్, వైడ్ యాంగిల్ సంస్థలతో కలిసి తెలుగులో నిర్మించబోతోంది. వెంకటేష్ హీరోగా నటిస్తారు. ఈ చిత్రానికి నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తారని ప్రచారం సాగుతోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపాయి సినిమా వర్గాలు.


Click it and Unblock the Notifications











