'సీతమ్మ వాకిట్లో...' , 'నాయక్' : సీడెడ్ రైట్స్ డిటేల్స్
హైదరాబాద్ : ప్రేక్షకుల తీర్పు కోరుతూ పెద్ద పండుగకు 'సీతమ్మ వాకిట్లో...' , 'నాయక్' టైటిల్స్ తో రెండు స్ట్రెయిట్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాల బిజినెస్ ఓ రేంజిలో జరిగింది. ముఖ్యంగా సీడెడ్ ఏరియాకు రెండు చిత్రాల రైట్స్ ని ఎన్.వి.ప్రసాద్ సొంతం చేసుకున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సీడెడ్ రైట్స్ ని తొమ్మిది కోట్లుకు తీసుకుంటే...'నాయక్' సీడెడ్ రైట్స్ ని ఎనిమిది కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. దాంతో ఆయన సీడెడ్ ఏరియాలో మొత్తం థియోటర్స్ ని బుక్ చేస్తున్నారు.
అత్యంత భారీ బడ్జెట్తో రూపొంది ఈ సంక్రాంతికి వస్తున్న రెండు సినిమాలు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ, అటు చిత్రసీమలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రెండు సినిమాలకీ సరికొత్త బాక్సాఫీస్ రికార్డులు సృష్టించే సత్తా ఉండటం గమనించదగ్గ అంశం. వాటిలో ఒకటి వెంకటేశ్, మహేశ్ అన్నదమ్ములుగా నటించగా, చాలా కాలం తర్వాత తెలుగులో వస్తున్న మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కాగా, రెండోది రాంచరణ్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన 'నాయక్'.
దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత భారీ మల్టీ స్టారర్గా చిత్రంగా నిర్మాత 'దిల్' రాజు ధీమాగా చెబుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం కూడా జనవరి 11న విడుదల కానుంది. గత డిసెంబర్ మాసం నుంచి ఈ సినిమా విడుదల అదే పనిగా వాయిదా పడుతూ వస్తోంది. తొలుత జనవరి 14న విడుదల కావచ్చనే టాక్ పరిశ్రమలో వినవచ్చింది. అయితే అదేమీ కాదన్నట్టుగా జనవరి 11న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇటీవల స్పష్టం చేశారు. వెంకటేష్, మహేష్, సమంత, అంజలి, జయసుధ, ప్రకాష్ రాజ్ లాంటి భారీ తారాగణంతో 'కొత్త బంగారులోకం' తర్వాత చాలా కాలం విరామం అనంతరం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న చిత్రం కావటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక గత సంవత్సరం రామ్చరణ్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో విడుదలైన 'రచ్చ' చిత్రం అభిమానులను మంచి విందు భోజనంగా అలరించింది. నిర్మాతకు కనక వర్షం కురిపించింది. 'రచ్చ' అందించిన విజయంతో జోరుమీదున్న రామ్ చరణ్ 'నాయక్' చిత్రంతో అదే మేజిక్ క్రియేట్ చేయాలని ఆరాటపడుతున్నారు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. రామ్ చరణ్కు జంటగా అమలాపాల్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. తన విజయపరంపరకు 'బద్రీనాథ్' గండికొట్టడంతో ఒకింత దిగాలుపడిన వి.వి.వినాయక్ 'నాయక్' చిత్రాన్ని కసిగా తీశారని టాలీవుడ్ చెప్పుకుంటోంది.


Click it and Unblock the Notifications











