Gurthunda Seethakalam: సత్యదేవ్ కోలుకోలేని షాక్.. అతడి కెరీర్లోనే చెత్తగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని.. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న హీరోల్లో సత్యదేవ్ ఒకడు. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. సోలో హీరోగా మారినప్పటి నుంచి సత్తా చాటుతోన్నాడు. విలక్షణమైన నటనతో ప్రతి సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోన్నాడు. ఫలితంగా మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే సత్యదేవ్ ఇప్పుడు 'గుర్తుందా శీతాకాలం' అనే ఫీల్ గుడ్ మూవీతో వచ్చేశాడు.
ఎప్పటికప్పుడు వినూత్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో కనిపించే సత్యదేవ్ ఇప్పుడు నాగశేఖర్ దర్శకత్వంలో 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాను చేశాడు. తన పాత ప్రేమకథలను చెబుతూ సాగే కథతో ఈ సినిమా రూపొందింది. ఇందులో కావాల్సినంత ఫన్తో పాటు ఎమోషన్ ఉంటుందని చిత్ర యూనిట్ చెప్పింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది గ్రాండ్గా విడుదలైంది. కానీ, ఈ చిత్రానికి ఆరంభంలోనే ప్రతికూలమైన టాక్ వచ్చింది. దీంతో ఈ ప్రభావం సినిమా ఓపెనింగ్స్పై చూపించింది.

సత్యదేవ్, తమన్నా భాటియా జంటగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' మూవీకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన దాని కంటే చాలా తక్కువ వసూళ్లు దక్కాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి శుక్రవారం కేవలం రూ. 25 - 28 లక్షలు గ్రాస్ మాత్రమే దక్కింది. అంటే.. దీనికి దాదాపు రూ. 15 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్లను కలుపుకుని దీనికి మరో ఐదు లక్షల రూపాయలు మాత్రమే వచ్చి ఉంటాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంటే మొత్తంగా దీనికి రూ. 30 లక్షలు గ్రాస్ మాత్రమే దక్కినట్లైంది. ఇది సత్యదేవ్ కెరీర్లోనే చెత్త రికార్డు అని తెలుస్తోంది.

సత్యదేవ్ హీరోగా నాగశేఖర్ తెరకెక్కించిన చిత్రమే 'గుర్తుందా శీతాకాలం'. ఈ సినిమాను భావనా రవి, నాగశేఖర్, రామారావులు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో తమన్నా హీరోయిన్గా నటించింది. కాల భైరవ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో మేఘా ఆకాశ్, కావ్యా శెట్టి, సుహాసిని తదితరులు కీలక పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











