'ఎవడు' ఎఫెక్ట్ : 'అత్తారింటికి దారేది' కి లాసా ?
హైదరాబాద్ : సాధారణంగా రెండు భారీ, క్రేజీ సినిమాలు వస్తున్నాయంటే ముందుగా విడుదలయ్యే సినిమాకి ఎక్కువ థియేటర్లు లభించే ప్రయోజనముంటుంది. ' సీతమ్మ వాకిట్లో..' వచ్చేసరికి 'నాయక్' కారణంగా అధిక సంఖ్యలో థియేటర్లు లభ్యం కాలేదు. ఆ మేరకు ఆ సినిమా ఓపెనింగ్స్ను నష్టపోయింది. ఇప్పుడు సైతం 'అత్తారింటికి దారేది' కంటే ఎక్కువ థియేటర్లలో 'ఎవడు' విడుదలయ్యే స్థితి నెలకొంది. వారం ముందుగా వస్తుండటం వల్ల 'ఎవడు'కు చేకూరుతున్న ప్రయోజనం ఇది.
రామ్చరణ్ 'నాయక్', వెంకటేశ్-మహేశ్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలు పోయిన సంక్రాంతికి విడుదలయ్యాయి. 'సీతమ్మ వాకిట్లో..' కంటే రెండు రోజులు ముందుగా 'నాయక్' అత్యధిక థియేటర్లలో విడుదలై బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ను రాబట్టింది. ఈ నేపధ్యంలో అత్తారింటికి దారేది..ఓపినింగ్స్ పై ఎవడు ప్రభావం పడుతుందా అనేది...ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ప్రధాన చర్చ.
ముఖ్యంగా ఈ రెండు మెగా సినిమాల రాకతో అప్పటిదాకా ఆడుతూ వచ్చే సినిమాలు థియేటర్ల నుంచి మాయం కానున్నాయి. కానీ 'అత్తారింటికి దారేది' విడుదలకు ఆ స్థితి ఉండదు. కారణం - అప్పటికే చాలా థియేటర్లలో 'ఎవడు' ఉండటం. ఒకే ఖాన్దాన్కు చెందిన హీరోలు ఇలా పోటీపడటం వారి అభిమానుల్లో ఆందోళనను రేకెత్తిస్తుంటే సినీ వర్గాలతో పాటు మిగతా సినీ ప్రేమికులు వారి పోటీని ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద మొదటిసారిగా బాహా బాహీ తలపడేందుకు సిద్ధమవుతున్నారు. వారిలో ఒకరు పవన్ కల్యాణ్ అయితే మరొకరు రామ్చరణ్. బాబాయ్ కల్యాణ్ సినిమా 'అత్తారింటికి దారేది' ఆగస్ట్ 7న విడుదలవుతుండగా, అబ్బాయ్ చరణ్ 'ఎవడు' అంటూ దానికి ఓ వారం ముందుగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.


Click it and Unblock the Notifications











