రజనీకాంత్ ‘2.0’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్?
భారతీయ సినిమా చరిత్రలో మరో హై బడ్జెట్ మూవీ రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న '2.0'. దాదాపు రూ. 400 కోట్లతో రూపొందిన ఈ చిత్రం గతేడాది చివర్లోనే రావాల్సి ఉండగా వాయిదా పడింది. విజువల్స్ ఎఫెక్ట్స్కు సంబంధించిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే ఇందుకు కారణం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టులో ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
సినిమా రిలీజ్ ఆసల్యం కావడం వల్ల ఇంతకాలం ప్రమోషన్స్ నిర్వహించడం పూర్తిగా తగ్గించేసిన నిర్మాతలు మళ్లీ ప్రేక్షకుల్లో ఈ మూవీపై అటెన్షన్ పెంచే ఆలోచలో ఉన్నారట. ఇందుకు ఐపీఎల్ ఫైనల్ ఈవెంటును వేదికగా ఎంచుకున్నట్లు సమాచారం. మే 27న జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో '2.ఓ' టీజర్ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే వేదికగా విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

సూపర్స్టార్ రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్కుమార్ విలన్గా పాత్ర పోసించడం సినిమాకు హైలెట్ కానుంది. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్ హుసేన్, కళాభవన్ షాజాన్, రియాజ్ ఖాన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వేలాది థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మరో వైపు రజనీకాంత్ నటించిన 'కాలా' మూవీ జూన్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. ధనుష్ నిర్మించిన ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కూడా లైకా ప్రొడక్షన్స్ వారే కొనుగోలు చేశారు. 'కాలా' విడుదలైన తర్వాత '2.0' మూవీ ప్రచార కార్యక్రమాల జోరు పెంచనున్నారు.


Click it and Unblock the Notifications











