చిరంజీవి వల్ల నిర్మాతకు రూ. 5 కోట్ల నష్టం?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల ఈచిత్రం షూటింగ్ కొంత పూర్తయిన తర్వాత చిరంజీవి సూచన మేరకు నటుడు రాజ్ కిరణ్ స్థానంలో ప్రకాష్ రాజ్ను తీసుకున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే రాజ్ కిరణ్ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయింది. అతనికి పేమెంట్ కూడా ఇచ్చారు. ఇపుడు అతన్ని తీసి ప్రకాష్ రాజ్ను తీసుకుని అందుకు సంబంధించిన సీన్లు మళ్లీ షూట్ చేయడం కారణంగా నిర్మాత బండ్ల గణేష్కు రూ. 5 కోట్ల నష్టం వచ్చినట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఆ మధ్య షూటింగుకు విరామం ఇవ్వడానికి కారణం కూడా ఇదేనట.

బడ్జెట్ ఎక్కువ అవుతోందని బండ్ల గణేష్ లోలోన మదన పడుతున్నప్పటికీ....బయటకు మాత్రం నవ్వుతూ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ...మెగా పవర్ స్టార్ రాంచరణ్, కాజల్ జంటగా మా బ్యానర్లో నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' తదుపరి షెడ్యూల్ ని జూన్ నుండి చేస్తున్నాము. ఈ షెడ్యూల్లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ షూటింగ్ చేయనున్నాము. ఈ షెడ్యూల్ అనంతరం యూనిట్ మొత్తం లండన్ షూటింగ్ కి వెళ్తారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ల మధ్య ప్రతి సన్నివేశం ఆధ్యంతం నవ్విస్తూ ఆకట్టుకుంటాయి. చక్కటి కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట కృష్ణ వంశీ. 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాన్ని తెలుగు సాంప్రదాయాలకు అద్దంపట్టేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. రామ్ చరణ్, కాజల్, శ్రీకాంత్ ఇలా ప్రతి ఒక్కరి వేషాలంకరణలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు కృష్ణ వంశీ. మా లిటిల్ బాస్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి అమితమైన రెస్పాన్స్ రావడమే దీనికి నిదర్శనం. ఈ ఫస్ట్ లుక్ తరువాత ట్రేడ్లో బిజినెస్ క్రేజ్ అమాంతం పెరిగిపోవడం విశేషం. రామ్ చరణ్ కెరీర్ లో ది బెస్ట్ బిజినెస్ ఈ చిత్రం చేయబోతుందనడంలో సందేహం లేదు అని తెలిపారు.


Click it and Unblock the Notifications











