దర్శకరత్న ఇలా దడ పుట్టించే దర్శకుడైపోవడమేంటో...?
దాసరి నారాయణ రావు 150వ చిత్రమంటూ హంగామా చేసిన 'పరమవీరచక్ర" వెండితెరకెక్కే అవకాశాలు బహు తక్కువేనని ఫిలింనగర్ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 'సింహా" తర్వాత కథల ఎంపికలో చాలా కచ్చితంగా వుండాలని నిశ్చియించుకున్నబాలకృష్ణ ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందే దాసరి సినిమాలో నటించడానికి తన సమ్మతం తెలిపారు. అయితే 'సింహా" అనూహ్య విజయం సాధించడం, టాలీవుడ్ నంబర్ వన్ అని కనీసం కొద్ది రోజులైనా అనిపించుకోవడానికి అది చిన్న అవకాశం కల్పించడంతో ఇకపై జాగ్రత్త వహించి టాప్ సీట్ ఎక్కాలని బాలకృష్ణ ఉబలాటపడుతున్నారు.
ఈ నేపథ్యంలో దాసరి నారాయణరావు తో సినిమా సబబు కాదని బాలయ్య శ్రేయోభిలాషులు, అభిమానులు కూడా ఆయనకి సలహాలిచ్చారు. అయినా దాసరి పెద్దరికాన్ని గౌరవించి, ఆయన పూర్తిస్థాయిలో కథ వినిపించే వరకు వేచి చూసిన బాలకృష్ణ ఇప్పుడా కథతో సంతృప్తి చెందలేదని, 'పరమవీరచక్రం" తిరగకుండా ఆగిపోయే ప్రమాదంలో పడిందని వదంతులు వాయు వేగంతో వ్యాపిస్తున్నాయి.
ఈ సినిమా ఉంటుందో లేదో నన్నది ఇంకా తేలకపోయినా డౌట్ లో పడ్డమే చాలనుకుని బాలకృష్ణ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక నిజంగా పరమవీరచక్ర ఆగిపోతే పెద్ద పెద్ద పార్టీలు చేసేసుకుంటారో ఏమో. విధి వైచిత్రి కాకుంటే వరుస విజయాల దర్శకరత్న కాస్తా ఇలా దడ పుట్టించే దర్శకుడైపోవడమేంటో?


Click it and Unblock the Notifications











