ప్రముఖ హీరో సోదరుడి దర్శకత్వంలో చిరంజీవి: 19 ఏళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ!
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై తిరుగులేని చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన స్టార్ హీరో. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి హీరోలు సూపర్ ఫామ్లో ఉన్న సమయంలోనే తన మార్క్ను చూపించారాయన. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకుని స్టార్ హీరోగా ఎదిగారు. నలభై ఏళ్లుగా ఇండస్ట్రీలో తన హవా చూపిస్తున్న ఆయన ఈ మధ్య సినిమాల వేగం పెంచేశారు. త్వరలో ఆయన చేయబోయే ఓ సినిమాకు స్టార్ హీరో సోదరుడిని డైరెక్టర్గా ఫిక్స్ చేశారు. దీంతో సదరు దర్శకుడు 19 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ వివరాలు మీకోసం.!

‘ఆచార్య’లా మారిన మెగాస్టార్ చిరంజీవి
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తుండగా, రామ్ చరణ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చిరంజీవి నక్సలైట్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

వరుసగా సినిమాలు... అన్నీ రీమేక్లే
‘ఆచార్య' షూటింగ్ పూర్తి కాకముందే చిరంజీవి.. మరిన్ని సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి క్లారిటీ ఇచ్చారు. ఇందులో సాహో డైరెక్టర్ సుజిత్, జై లవ కుశ ఫేం బాబీ, మెహర్ రమేష్ పేర్లను ప్రకటించారు. ఈ ముగ్గురు డైరెక్టర్లు తెరకెక్కించే చిత్రాల్లో రెండు రీమేక్లే ఉండడం విశేషం.

చిరు లిస్టు నుంచి కుర్ర డైరెక్టర్ అవుట్
సుజిత్తో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్'ను రీమేక్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి భావించారు. అందుకు అనుగుణంగానే ఆ స్క్రిప్టును మన నేటివిటీకి సరిపడేలా మార్చాలని అతడికి సూచించారు. ఆ తర్వాత ఈ కుర్ర దర్శకుడు స్క్రిప్టు వర్క్ కూడా ప్రారంభించేశాడు. అలాంటి పరిస్థితుల్లో అనివార్య కారణాలతో సాహో దర్శకుడు ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు.

మరో డైరెక్టర్ కోసం అన్వేషన్ మొదలు
చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించిన లూసీఫర్ రీమేక్ నుంచి సుజిత్ తప్పుకోవడంతో, మరో దర్శకుడి కోసం ఆయన అన్వేషణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే వీవీ వినాయక్తో సంప్రదింపులు కూడా జరిపించారు. మొదట ఆయన సినిమా చేస్తానని చెప్పినా.. ఆ తర్వాత చేతులెత్తేశాడు. దీంతో హరీశ్ శంకర్తోనూ నిర్మాతలు చర్చలు జరపగా.. సదరు డైరెక్టర్ తిరస్కరించాడు.

హీరో సోదరుడి దర్శకత్వంలో చిరంజీవి
లూసీఫర్ రీమేక్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ డేసీషన్ తీసుకున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి సోదరుడైన దర్శకుడు మోహన్ రాజాను ఈ సినిమా కోసం ఫైనల్ చేశారట. ఇప్పటికే ఈ సినిమా విషయమై ఆయన అంగీకారం కూడా తెలిపారని తెలిసింది. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారని టాక్.
Recommended Video

19 ఏళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ!
మోహన్ రాజా తన మొదటి సినిమాను తెలుగులోనే చేశారు. 2001లో అర్జున్, జగపతిబాబు కలయికలో వచ్చిన ‘హనుమాన్ జంక్షన్'తోనే ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత మన ‘జయం' మూవీని తమిళంలో తన సోదరుడిని పెట్టి తీశారు. ఆ తర్వాత కోలీవుడ్లో సెటిల్ అయ్యారు. ఇక, ‘ధృవ' మాతృక అయిన ‘తని ఒరువన్'కు దర్శకుడు మోహన్ రాజానే.


Click it and Unblock the Notifications











