'డమరుకం' నిర్మాతపై నాగార్జున ఫైర్?
హైదరాబాద్: నాగార్జున తాజా చిత్రం 'డమరుకం'. ఈ చిత్రం 20న విడుదల తేదీ ప్రకటించాక మళ్లీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ విషయమై నాగార్జున.. చిత్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ పై మండిపడుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. తను మీడియాలో ఈ చిత్రం విడుదల గురించి గత పదిహేను రోజులుగా కంటిన్యూగా పబ్లిసిటీ చేస్తూంటే హఠాత్తుగా రిలీజ్ డేట్ ఎందుకు మార్చారని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ధియోటర్ దొరకవనే సమస్య ఉన్నప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించటానికి ముందే ఆ విషయం తెలుస్తుందిగా అని ఆయన ప్రశ్నించినట్లు చెప్తున్నారు. అన్ని చోట్లా 20 న విడుదల అని పోస్టర్స్ వేసారు. ట్రైలర్స్ కూడా అదే తేదీ కన్ఫర్మ్ చేస్తూ విడుదల చేసారు. ఈ నేపధ్యంలో నాగార్జున కోపానికి సరైన విడుదల తేదీ ఖరారు చేసుకోకపోవటం కారణమైందని తెలుస్తోంది.
ఇటీవలే 'శిరిడీసాయి' చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన నాగ్ తాజాగా సోషియోఫాంటసీ చిత్రం 'ఢమరుకం'తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై డా॥ వెంకట్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాసడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అవుట్పుట్ చూశాక మహాద్భుతమనిపించింది అంటున్నారు నాగార్జున. 'మమ్మీ' 'యుగాంతం'లాంటి చిత్రాల తరహాలో ఈ చిత్రం ఉంటుందని హామీ ఇస్తున్నారు.
'ఢమరుకం' కథ ఏమిటంటే... తెలుగు పురాణేతిహాసాల ఆధారంగా తయారుచేసుకున్న కథాంశమిది. రాక్షససంహారం జరిగిన తర్వాత శత్రుశేషంగా అంధకాసురుడు అనే రాక్షసుడు ఒక్కడే మిగిలిపోతాడు. వెయ్యి సంవత్సరాలకొక్కసారి గ్రహాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి విశ్వంలో ఓ మహాద్భుతఘట్టం సాక్షాత్కరించే సమయంలో అంధకాసురుడు తిరిగి జన్మిస్తాడు. ఆ పవిత్ర ఘడియల్లో పుట్టడం వల్ల పంచభూతాలు అతని ఆధీనంలోకి వస్తాయి. అతన్ని శివుడి అంశతో జన్మించిన ఓ యువకుడు నిలువరించి లోకకల్యాణం ఎలా చేశాడు. గ్రహాలన్నీ ఒక్కటైనా ఆ పవిత్ర ముహూర్తంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నది హీరో ఆశయం. ఎలా వివాహం చేసుకున్నాడు అనేది సినిమా కథ. ఈ చిత్రంలో అంధకాసురుడి పాత్రను రవిశంకర్ పోషించారు. మానవరూపంలో వున్న శివుడిగా ప్రకాష్రాజ్ కనిపిస్తారు.
తొలిసారి సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్న నాగార్జున 'డమరుకం' పై బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన ఈ చిత్రంలో హైలెట్స్ గురించి చెపుతూ... కథ బాగా నచ్చింది. నాకు స్వతహాగా 'మమ్మీ' 'యుగాంతం'లాంటి గ్రాఫిక్స్ హంగులున్న హాలీవుడ్ సినిమాలంటే ఇష్టం. అలాంటి సినిమాలు బాగా చూస్తాను. 'డమరుకం' కథ చెప్పినప్పుడు ఆ సినిమాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఇక గ్రాఫిక్స్పరంగా తెలుగు సినిమాల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. 'మగధీర'ను మించిన గ్రాఫిక్స్ వుంటాయి. ఇలాంటి గ్రాఫిక్స్ ప్రధాన చిత్రాల్లో నటించడం అంత సులువు కాదు. చిన్న రూమ్లో నాతో ఓ సీన్ తీశారు. దాన్ని బ్లూమ్యాట్లో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో చూపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మన ముందులేని పాత్రల్ని ఊహించుకొని అభినయించడం కష్టమైన విషయం. 'డమరుకం'లో అలాంటి సన్నివేశాలు చాలా చేశాను. 'ఈగ' సినిమాలో కూడా సుదీప్ అలానే అభినయించాడు అన్నారు.


Click it and Unblock the Notifications











