జూ ఎన్టీఆర్ సరికొత్త ప్లాన్: అమెరికాలో ఆడియో వేడుక!?
హైదరాబాద్: తెలుగు సినిమాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన టెర్రిటరీల్లో యూఎస్ఏ కూడా ఒకటి. విదేశాల్లో ఇండియన్స్, ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా ఉండేది ఈ దేశంలోనే. దీంతో తెలుగులో పెద్ద హీరోల సినిమాలకు వచ్చే కలెక్షన్లలో దాదాపు 10 నుండి 20 శాతం ఇక్కడి నుండే వస్తున్నాయి. అందుకే ఇక్కడి మార్కెట్ మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో చిత్రాలు ఓవర్సీస్లో మంచి వసూళ్లు సాధించాయి. ఈ నేపధ్యంలో అక్కడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు తన తాజా చిత్రం 'జనతా గ్యారేజ్' ఆడియో ఫంక్షన్ను అమెరికాలో భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

గతంలో కొందరు పెద్ద హీరోలు తమ సినిమాల ఆడియో వేడుక ఇక్కడ చేసేందుకు ప్లాన్ చేసినా అది ఆచరణకు నోచుకోలేదు. అయితే జూనియర్ మాత్రం ఎలాగైనా అమెరికాలో ఆడియో వేకడ చేయాలనే విషయంలో కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
జనతా గ్యారేజ్ సినిమా విషయానికొస్తే.... మైత్రీమూవీమేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రత్యేకంగా వేసిన గ్యారేజ్ సెట్లో షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు కొరటాల శివ ఇప్పటి వరకు దర్శకుడిగా రెండు సినిమాలు చేసారు. రెండు సినిమాల్లోనూ హీరోలను డిఫరెంట్ స్టైల్లో చూపించారు. ముఖ్యంగా హీరో లుక్, యాటిట్యూడ్ విషయంలో కొరటాల చాలా కేర్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ ను డిఫరెంటుగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లు. మోహన్ లాల్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











