పవన్ ని ప్రచారానికి రావద్దని బ్రతిమాలుతున్నారు
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తే తమకు నష్టం కాబట్టి ఆయన్ను దయచేసి ప్రచారానికి రాకుండా ఆపుచేయండని టీడీపి నేతలు కోరుతున్నారు. అయితే ఆ నేతలు మల్కాజిగిరి నియోజక వర్గానికి చెందిన వారు అని సమాచారం. రాష్ట్రమంతటా పవన్ ..తెలుగుదేశం పార్టీకి సపోర్టు ఇస్తూ...మల్కాజ్ గిరిలో మాత్రం ఇవ్వనని తేల్చి చెప్పేసారు. అంతేకాకుండా లోక్సత్తా తరుపున ప్రచారం చేస్తానని చెప్పారు. దాంతో అక్కడ నిలబడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్దులుకు సమస్య వచ్చి పడింది. తమకు ప్రచారం చేయకపోయినా ఫర్వాలేదు...ఇక్కడకి వచ్చి వేరే పార్టీకి ప్రచారం చేయకుండా పవన్ ని నిలపాలని వారు కోరుకుంటున్నారు.
ఈ విషయమై ఉభయుల మధ్య ఒకటి రెండుసార్లు చర్చలు జరిగినా అవింకా కొలిక్కి రాలేదని సమాచారం. మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మల్లారెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడే లోక్సత్తా తరపున జయప్రకాశ్ నారాయణ పోటీ చేస్తున్నారు. జేపీ తరపున ప్రచారం చేస్తానని పవన్ ప్రకటన చేశారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

మల్కాజ్గిరిలో టీడీపీ అభ్యర్థికి స్పష్టమైన విజయావకాశాలున్నాయని, జేపీ తరపున పవన్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ అభ్యర్థి లాభపడతారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. కానీ, ప్రచారం చేస్తానని తాను ఇప్పటికే జేపీకి హామీ ఇచ్చానని పవన్ టీడీపీ నేతలకు వివరించారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో సీమాంధ్ర ఓటర్ల ఓట్లు అత్యధిక శాతం తమకే దక్కుతాయని టీడీపీ భావిస్తోంది. కానీ, జేపీ తరపున పవన్ ప్రచారం చేస్తే ఆ ఓట్లలో చీలిక ఏర్పడి ఇద్దరూ దెబ్బతింటారని ఆందోళన వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications











