సంక్రాంతి బరిలో మార్పులు.. వెనక్కు తగ్గిన RRR, తగ్గనన్న రాధేశ్యామ్.. బరిలోకి భీమ్లా నాయక్, బంగార్రాజు!
తెలుగు సినిమాల విషయానికి వచ్చే సరికి సంక్రాంతి అనేది అతి పెద్ద సీజన్. అందుకే పెద్ద సినిమాలు మొదలు చిన్న సినిమాల దాకా ఈ సీజన్లో రావడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. అయితే 2022 సంక్రాంతి సీజన్ ఆసక్తికరంగా సాగనుంది. ఇప్పటి వరకు సంక్రాంతికి RRR, రాధే శ్యామ్ సినిమాలు వస్తాయని భావిస్తుండగా ఆ రెండు సినిమాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. అలాగే ఇప్పటికే వాయిదా పడిన వెనక్కి వెళ్లిన మరో రెండు సినిమాలు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

తల నొప్పిగా
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి సంక్రాంతి అనేది చాలా పెద్ద సీజన్. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు వ్యవహారం కాస్త తల నొప్పిగా మారింది కానీ ఆ తల నొప్పి లేకుండా ఉంటే సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు విడుదలైనా సరే ఎలాంటి ఢోకా ఉండని పరిస్థితి నెలకొని ఉండేది. అయితే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు భారీగా తగ్గించి ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఏ మాత్రం సహకరించని నేపథ్యంలో కేవలం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుని రాజమౌళి RRR సినిమా, ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమాలను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.

50 శాతం ఆక్యుపెన్సీ
అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అనే విధంగా ఇప్పుడు అనూహ్య పరిస్థితుల్లో రాజమౌళి RRR సినిమా అలాగే ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ విధానం అమలులోకి వచ్చింది. అలాగే నైట్ కర్ఫ్యూ కూడా అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక షో తగ్గటమే కాక ప్రతి షో లో కూడా 50 శాతం మాత్రమే టిక్కెట్లు అమ్ముడవనున్నాయి. ఇప్పటి వరకు ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి రెండు రాష్ట్రాల వరకే ఈ తలనొప్పి ఉంది అనుకుంటూ ఉండగా అనూహ్యంగా శుక్రవారం సాయంత్రం తమిళనాడు రాష్ట్రం కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

RRR వాయిదా
తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రకటన అనంతరం రాజమౌళి RRR సినిమాని వాయిదా వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. అయితే అది ప్రచారం కాదని నిజంగానే సినిమాను వాయిదా వేసుకోవాలని యోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా ఈరోజు సాయంత్రం లోపు ఏర్పాటు చేసి ప్రేక్షకులు తనను క్షమించవలసిందిగా కోరి సినిమా వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. RRR కనుక వాయిదా వేస్తే రాధేశ్యాం సినిమా దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాను కూడా వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది.

వెనక్కి తగ్గనంటున్న రాధేశ్యామ్
ఈ రెండు సినిమాలు ఇన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న నేపథ్యంలో లో తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి అనేక రాష్ట్రాల పరిస్థితులు కూడా చాలా కీలకం. ఈ నేపథ్యంలోనే రాధేశ్యామ్ కూడా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ కొద్ది సేపటి క్రితం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ లో మాత్రం విడుదల తేదీలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవంటూ 14నే సినిమా వస్తుందని పేర్కొన్నారు. ఇది పక్కన పెడితే సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు గా నాగార్జున బంగార్రాజు సినిమా యూనిట్ కూడా ప్రకటించింది. డేట్ ఎప్పుడు అనే దాని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ తాజాగా విడుదల చేసిన టీజర్ లో మాత్రం ఈ సంక్రాంతికి థియేటర్లలో బంగార్రాజు దిగుతున్నాడు అని పేర్కొంది.

12వ తేదీన భీమ్లా నాయక్
అయితే RRR సినిమా, రాధేశ్యామ్ సినిమా లాంటి రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ సినిమా విడుదల వాయిదా వేసుకోవాలని ఆ నిర్మాతను నిర్మాతల మండలి కోరింది. అందుకే జనవరి 12వ తేదీన విడుదల కావాల్సిన సినిమాను నెల పాటు వాయిదా వేసి ఫిబ్రవరి 25వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కనుక RRR సినిమా వాయిదా పడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న తేదీకి అంటే 12వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. భీమ్లా నాయక్ సినిమా కేవలం తెలుగులోనే విడుదలవుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల పరిస్థితులతో భీమ్లా నాయక్ సినిమాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Recommended Video

ఎంతవరకు నిజం?
అయితే జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజం అవుతుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ప్రమోషన్స్ కోసం RRR యూనిట్ భారీగా ఖర్చు చేసింది. దర్శకధీరుడు రాజమౌళి, రామ్ చరణ్ తేజ, ఎన్టీఆర్, అలియా భట్ వంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాలలో ఈవెంట్లు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా జరిగిన అన్ని ఈవెంట్లు వృధా అయినట్టే చెప్పాలి. కానీ సుమారు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా కాబట్టి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న సమయంలో విడుదల చేయడం అనేది ఇబ్బందికర పరిణామామమే అని చెప్పాలి. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











