మహేశ్ బాబు స్టోరీతో వెబ్ సిరీస్: డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా
'మున్నా' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు వంశీ పైడిపల్లి. ఈ సినిమా పరాజయం పాలైనప్పటికీ.. దర్శకుడిగా ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టింది. అందుకే ఆయనతో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 'బృందావనం' అనే సినిమా చేశాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో వంశీ పైడిపల్లి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్తో 'ఎవడు', నాగార్జున - కార్తీ కాంబినేషన్లో 'ఊపిరి' తెరకెక్కించాడు. ఇక, ఇటీవల మహేశ్ బాబు 'మహర్షి' తీసి మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
'మహర్షి' తర్వాత వంశీ పైడిపల్లితో మరోసారి సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు మహేశ్ బాబు. ఇందుకోసం ఓ గ్యాంగ్స్టర్ నేపథ్యం ఉన్న కథను కూడా రెడీ చేశాడాయన. కొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందనుకున్న సమయంలో దీని నుంచి తప్పుకున్నాడు సూపర్ స్టార్. అంతేకాదు, పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే సినిమాను కూడా ప్రకటించాడు. ఆ సమయంలో వంశీ పైడిపల్లి పలువురు హీరోలను సంప్రదించినా వర్కౌట్ కాలేదు. దీంతో సినిమాలతో లాభం లేదనుకున్నాడో ఏమో.. వెబ్ సిరీస్ తీయడానికి ముందుకొచ్చాడు.

బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఏర్పాటు చేసిన 'ఆహా' కోసం వంశీ పైడిపల్లి ఓ వెబ్ సిరీస్ను రూపొందిస్తున్నాడు. తాజాగా దీనికి గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... ఈ సిరీస్ను మాఫియా బ్యాగ్డ్రాప్లో క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నాడట. అంతేకాదు, మహేశ్ బాబుకు చెప్పిన కథలో కొన్ని మార్పులు చేసి దీన్ని రూపొందిస్తున్నాడని అంటున్నారు. దీంతో ఆ వెబ్ సిరీస్పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











