వెంకటేష్ కోసం స్పెషల్ సెట్: సూపర్ హిట్ మూవీ సీక్వెల్ మొదలైపోయింది
టాలీవుడ్లో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో వరుసగా అదే తరహా సినిమాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే గత ఏడాది విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నటించిన ఈ మల్టీ స్టారర్ మూవీ 'F2'. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే క్యాప్షన్తో వచ్చిందీ మూవీ. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ తీస్తున్నారు. 'F3' అనే టైటిల్తో రాబోతున్న ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. సుదీర్ఘ విరామం తర్వాత 'F3' స్టోరీని రెడీ చేశాడు. డబ్బు వల్లే అందరిలోనూ ఫ్రస్టేషన్ మొదలవుతుంది అనే కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులోనూ విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నటిస్తున్నారు. వీళ్లతో పాటు మరో స్టార్ హీరో కూడా కీలక పాత్ర పోషిస్తాడని ప్రచారం జరుగుతోన్నా.. క్లారిటీ మాత్రం రావడం లేదు. ఇదిలా ఉండగా, ఈ సినిమాపైనా భారీ అంచనాలే ఉన్నాయి. దీని కోసం నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ను కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ 23 బుధవారం నుంచి ప్రారంభం అయినట్లు తెలిసింది. హైదరాబాద్లోని కొండాపూర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్తో చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో విక్టరీ వెంకటేష్పై పలు కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్లు వినికిడి. దీని తర్వాత మిగిలిన నటీనటుల డేట్స్ ప్రకారం షూటింగ్ జరపబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సినిమా కోసం వెంకటేష్కు రూ. 13 కోట్లు, వరుణ్ తేజ్కు రూ. 8 కోట్లు, దర్శకుడు అనిల్ రావిపూడికి రూ. 10 కోట్లు రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నాడట నిర్మాత దిల్ రాజు.


Click it and Unblock the Notifications











