థియేటర్లు దేవాలయం లాంటివి.. చాలా బాధగా ఉంది.. థియేటర్ల మూత గురించి నిఖిల్ ఎమోషనల్!
ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం విధించిన రేట్లకు టికెట్ రేట్లకు టికట్లన అమ్ముకోలేక చాలా మంది థియేటర్లను మూసేస్తున్నారు. ఏపీలో దాదాపు అరవై థియేటర్లను స్వచ్చందంగా మూసేశారు అని సమాచారం. ఈ విషయంలో హీరో నాని, సిద్ధార్థ్ లాంటి వాళ్లు మాట్లాడుతూనే ఉన్నారు. నాని నోరు విప్పడంతో ఏపీ మంత్రులు నానిని టార్గెట్ చేస్తూ విమర్శించారు. ఇప్పుడు ఇదే విషయం మీద నిఖిల్ కూడా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

కొనసాగుతున్న తనిఖీలు
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పలు పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కూడా సినిమా థియేటర్లలో తనిఖీలు కొనసాగాయి. నిబంధనలు అమలు చేయడం లేదన్న కారణాలతో శుక్రవారం రోజున పలుచోట్ల థియేటర్లు సీజ్ చేశారు. ఆయా లోపాలపై థియోటర్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు.

తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు
మరోవైపు టికెట్ల ధరలు అతి తక్కువగా ఉన్నందున థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కొన్నిచోట్ల బోర్డులు పెడుతున్నారు, దీంతో సినిమా ధియేటర్ల తనిఖీలు పరంపర కొనసాగుతోంది. శుక్రవారం రోజున విజయవాడ నగరంలోని అన్నపూర్ణ, శకుంతల, అప్సర థియేటర్లను జాయింట్ కలెక్టర్ మాధవీలత.. ఆకస్మికంగా తనిఖీ చేశారు, క్యాంటీన్ వద్ద ధరల పట్టికను పరిశీలించారు. అలా నిబంధనలు పాటించడంలేదని కృష్ణా జిల్లాలో మొత్తం 12 థియేటర్లను అధికారులు మూయించారు.

థియేటర్ల సీజ్
అలాగే టిక్కెట్ల ధరలు తగ్గించడంతో జిల్లాలో 18 సినిమా హాళ్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. అలా మొత్తం మీద జిల్లాలో 30 థియేటర్లు మూతపడ్డాయి. గుంటూరు జిల్లాలో 70 థియేటర్లను అధికారులు తనిఖీ చేశారు, 35 సినిమా హాళ్లకు నోటీసులు జారీ చేశారు. 15 సినిమాహాళ్లు మూసివేతకు ఆదేశాలు జారీచేశారు. గుంటూరులోని శ్రీలక్ష్మి ధియేటర్ను సీజ్ చేశారు.
అనుమతి లేకుండా శ్యామ్ సింగరాయ్ సినిమా బెనిఫిట్ షో వేసిన 4 థియేటర్లకు పది వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు, ఇక బిఫామ్ రెన్యువల్ చేయని 25 ధియేటర్లకు జరిమానా విధించారు, చిలకలూరిపేట లైసెన్స్ రెన్యువల్ చేసుకని కారణంగా రామకృష్ణ, శ్రీనివాస, విజయలక్ష్మి, వెంకటేశ్వర, కృష్ణ మహల్ థియేటర్లను అధికారులు సీజ్ చేశారు.

నిఖిల్ సోషల్ మీడియా వేదికగా
తాజాగా ఈ విషయంపై యంగ్ హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ట్రైన్ లో టైర్ కంపార్ట్మెంట్స్ ఆధారంగా టికెట్లు ఎలా నిర్ణయిస్తున్నారో.. అలాగే థియేటర్లలో టికెట్ రేట్లను నిర్ణయించాలని కోరారు. ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్ లో 20 రూపాయల టికెట్ సెక్షన్ కూడా ఉందని.. ఇప్పుడున్న సినిమా థియేటర్లు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఆనందాన్ని ఇస్తా
ఫ్లెక్సిబుల్ టికెట్ రేట్ తో బాల్కనీ, ప్రీమియర్ విభాగాన్ని అనుమతించమని అధికారులను కోరారు నిఖిల్. థియేటర్లు తనకు దేవాలయం లాంటివని.. ప్రజలకు ఎప్పుడూ అవి ఆనందాన్ని ఇస్తాయని నిఖిల్ చెప్పుకొచ్చారు. థియేటర్లు మూతపడడంతో చాలా బాధగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమను ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్న నిఖిల్ ఏపీ ప్రభుత్వం కూడా థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











