రష్మిక మందన్నకు గుడి కట్టడమా? ట్రోల్స్తో కన్నడ భామకు షాక్
సినీ తారలపై ప్రేక్షకులు విపరీతమైన అభిమానం పెంచుకోవడం కొత్తేమీ కాదు. గతంలో ఎన్టీఆర్ను మొదలుకొని ఏఎన్నాఆర్, కృష్ణ, చిరంజీవి, కుష్బూ లాంటి సినీ తారలపై తమ ప్రేమను, అభిమానాన్ని రకరకాల పద్దతుల్లో కురిపించిన సంగతి తెలిసిందే. గతంలో తమిళనాడులో కుష్భూ, నమితకు గుడి కట్టి పూజించిన విషయం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ఫ్యాన్స్ తనకు ఆలయం కడితే బాగుండనే విషయం వైరల్ అయింది. ఈ సారి అభిమాన దేవతగా మారాలనుకున్నది మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే...

ఫ్యాన్స్ గుండెల్లో నిలువాలని
ఇటీవల రష్మిక మీడియాతో మాట్లాడుతూ.. 90వ దశకంలో కుష్బూకు ఉన్న ఫాలోయింగ్ గురించి మా నాన్న నాకు చెప్పేవారు. ఆమెకు గుడికట్టి పూజలు కూడా చేశారని చెప్పారు. అలాంటి అభిమానాన్ని నేను కూడా సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తాను. నేను పోషించే పాత్రల ద్వారా అభిమానుల గుండెల్లో నిలిచిపోవాలని అనుకొంటున్నాను అని రష్మిక చెప్పారు.

రష్మిక మందన్న కోరికపై విస్మయం
ఇక తన అభిమానులు కూడా తనకు గుడి కడితే అంతకంటే సంతోషం ఏముంటుంది? నాకు కూడా నా ఫ్యాన్స్ ఓ గుడి కడితే బాగుండు అని తన సన్నిహితులతో చెప్పిందట. రష్మిక కోరిక విని సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమవుతున్నది. అయితే కుష్బూకు గుడి కట్టిన అభిమానులు అదే ఆలయాన్ని కూల్చివేసిన విషయం కూడా తెలుసుకొంటే బాగుండు అనే విషయాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

వివాదాల్లో రష్మిక
కన్నడ భామ రష్మిక ఇటీవల ఇలాంటి వివాదాల్లో కూరుకుపోవడం సాధారణంగా మారింది. కన్నడ భాష కూడా మాట్లాడం రాదని కొందరు శాండల్వుడ్ తారలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. తనకు కన్నడ భాష మాట్లాడటం రాదనే వ్యాఖ్యలతో రష్మిక ఇరుకున పడింది. తాజాగా గుడి వ్యవహారంలో మళ్లీ ఇబ్బందుల పాలైంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రష్మికకు ఎందుకింత అత్యాశ అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

సక్సెస్ భాటలో కన్నడ భామ
ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో రష్మిక మందన్న హవా కొనసాగుతున్నది. ఆమె నటించిన చిత్రాలు భారీ విజయాలు అందుకొంటున్నాయి. తెలుగులో ముఖ్యంగా ఛలో, గీత గోవిందం, దేవదాస్, తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రాలు కాసుల పంటను పండించాయి. డియర్ కామ్రేడ్ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇక తమిళ సినీ పరిశ్రమపై కూడా రష్మిక దృష్టిపెట్టింది. కన్నడలో కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్నది.

మహేష్ లాంటి అగ్రహీరోలతో
టాలీవుడ్లో రష్మిక మందన్న క్రేజ్ తగినట్టే అవకాశాలు వెంటాడుతున్నాయి. అనిల్ రావిపుడి దర్శకత్వంలో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక నటిస్తున్నది. అలాగే అల్లు అర్జున్ చిత్రంలోనూ, నితిన్ సినిమాలోను నటించే అవకాశాలను కొట్టేసింది. టాలీవుడ్లో ఏ హీరోయిన్కు లేని ప్రాజెక్టులు ప్రస్తుతం కన్నడభామ చేతిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications










