రేణూ దేశాయ్ చేతిపై స్పెషల్ టాటూ.. దాని అర్థం ఏంటో తెలుసా?
టాలీవుడ్ నటి రేణు దేశాయ్(Renu Desai)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తరువాత కాలంలోకాస్ట్యూమ్ డిజైనర్గా, నిర్మాతగా, డైరెక్టర్గా తన మల్టీటాలెంట్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ ఇప్పుడు ఆధ్యాత్మికత దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణూ తన చేయిపై ఉన్న ప్రత్యేక టాటూ ను చూపించారు. దాని వెనుక ఉన్న కథను, ఆ టాటూ అర్థాన్ని వెల్లడించారు. ఇంతకీ ఆ టాటూ మీనింగ్ ఏంటీ?
"బద్రి", "జానీ" సినిమాల ద్వారా పరిచయమైన రేణు దేశాయ్, ఆ తరువాత పవన్ కళ్యాణ్తో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆధ్య ఉన్నారు. అయితే కొంత కాలం తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత రేణు దేశాయ్ సినిమాల నుంచి దూరమై, కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాత, దర్శకురాలిగా తన ప్రతిభను చూపించారు. కొన్నేళ్ల విరామం తర్వాత "టైగర్ నాగేశ్వరరావు" చిత్రంతో తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు సినిమాల కన్నా ఆధ్యాత్మిక జీవన విధానంపై దృష్టి పెట్టారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రేణు దేశాయ్. ఈ సమయంలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన చేయిపై ఉన్న టాటూ "స్థితప్రజ్ఞ" వెనుక ఉన్న అర్థాన్ని వివరించారు. ఆమె మాట్లాడుతూ "స్థితప్రజ్ఞ అంటే భౌతిక కోరికలు, అహంకారం నుండి విముక్తి పొంది, అన్ని పరిస్థితుల్లోనూ సమతుల్యతతో, ప్రశాంతతతో ఉండే వ్యక్తి. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనసు స్థిరంగా ఉంచడం నేర్చుకోవాలి" అని చెప్పారు. తాను అదే మార్గంలో నడుస్తున్నానని వెల్లడించారు.
ఆ ఇంటర్వ్యూలో డిప్రెషన్, నెగెటివిటీ వంటి విషయాలపై కూడా ఆమె తన ఆలోచనలను పంచుకున్నారు. "డిప్రెషన్ అనేది అనేక రూపాల్లో వస్తుంది. ఉద్యోగం కోల్పోవడం, స్నేహితులు దూరమవడం, ప్రియమైనవారు మనల్నీ వీడిచి వెళ్లడం వంటి సంఘటనలు మనసుపై ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా మనం మానసిక ఒత్తిడిలోకి వెళ్తాం. చంద్రుడి గమనం కూడా మన మానసిక ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. అందుకే నేను ఏకాదశి నాడు ఉపవాసం చేస్తాను. ఇది కేవలం ఆధ్యాత్మికం కాదు, సైంటిఫిక్ కారణం కూడా ఉంది" అని తెలిపారు.
రేణు దేశాయ్ మన పూర్వీకులు చెప్పిన విషయాల్లో శాస్త్రీయత దాగి ఉందని, వేదాలలో మన జీవన విధానానికి అవసరమైన జ్ఞానం ఉందని పేర్కొన్నారు. "సనాతన ధర్మం అనేది మతం కాదు, జీవన విధానం. దానిని పాటిస్తే మన ఆలోచనలు మారుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది" అని చెప్పారు. తాను సాధువు కాదని, కానీ సాధ్యమైనంతవరకు ఆ మార్గంలో నడుస్తానని రేణు దేశాయ్ తెలిపారు.
"మానవ జన్మ అంటే ఇతరులకు తోడ్పడడం, మంచి చేయడం. అదే నిజమైన జీవితం. మనం చేసే పనులు, మన కర్మే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. కర్మ సిద్ధాంతాన్ని నేను గట్టిగా నమ్ముతాను" అని రేణు దేశాయ్ చెప్పారు. చివరగా ఆమె తన జీవన తత్వాన్ని వెల్లడిస్తూ "మనసు ప్రశాంతంగా ఉంటే జీవితంలో ఏ కష్టం కూడా మనల్ని కదిలించలేడు" అని పేర్కొన్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ ఆధ్యాత్మిక వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులను మాత్రమే కాదు, సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











