‘కాలా’ కర్నాటక వివాదం: రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్
తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య ఉన్న కావేరీ జలాల వివాదం చివరకు రజనీకాంత్ నటించిన 'కాలా' చిత్రానికి భారీ నష్టం తెచ్చేలా పరిణమించింది. ఈ విషయంలో రజనీకాంత్ ఎప్పుడో చేసిన వ్యాఖ్యలను ఇపుడు తెరపైకి తీసుకొచ్చిన కన్నడిగులు తమ ప్రతాపాన్ని ఆయన నటించిన సినిమాపై చూపిస్తున్నారు. ఈ వివాదంలో అటు కన్నడ సంఘాలు, ఇటు 'కాలా' నిర్మాతలు కోర్టు మెట్లు ఎక్కారు. చివరకు పోలీసుల భద్రత మధ్య సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది.

థియేటర్లకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశం
కావేరి జలాల విషయంలో రజనీకాంత్ పూర్తిగా తమిళులకి మద్దతు ఇవ్వడంతో ఆయన సినిమాలని కర్నాటకలో నిషేదం విధించాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనే వాదనను కర్నాటక హైకోర్టు తోసిపుచ్చింది. ‘కాలా' నిషేధంపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాలా సినిమా ప్రదర్శనకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేసింది.

కర్నాటక వివాదంపై రజనీకాంత్ స్పందిస్తూ....
‘కాలా' విడుదలకు ఎలాంటి ఆటంకం కలగబోదని ఆశిస్తున్నట్లు రజనీకాంత్ లిపారు. కర్నాటకలో కన్నడ ప్రజలు మాత్రమే కాదు, ఇతర భాషల ప్రజలు కూడా ఉన్నారు, వారు సినిమా చూడాలనుకుంటున్నారు, అందుకు తగిన పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు.

థియేటర్ యజమానుల్లో భయం
కోర్టు నుండి ఆదేశాలు వచ్చినప్పటికీ థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. కన్నడ ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సినిమా విడుదల అడ్డుకోవాలనే ఒత్తిడి ఉండటం, ఇది చాలా సున్నితమైన అంశం కావడమే ఇందుకు కారణం. వారి అభీష్టానికి వ్యతిరేకంగా ముందుకు వెళితే తర్వాత జరిగే పరిణామాలకు బలవ్వాల్సి ఉంటుందనే భయం వారిలో నెలకొని ఉంది.

భారీ నష్టం తప్పదా?
కర్నాటకలో ‘కాలా' విడుదల కాకపోతే రూ. 15 కోట్ల నుండి రూ. 20 కోట్ల నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసు భద్రత మధ్య సినిమా విడుదల చేసినా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటే సినిమాకు కలెక్షన్లు అనుకున్న స్థాయిలో ఉండవని టాక్.


Click it and Unblock the Notifications











