ఇండస్ట్రీలో మరో విషాదం.. దృశ్యం 2 నటుడి కన్నుమూత!
ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. బాషలతో సంబంధం లేకుండా తమిళ నటుడు వివేక్ మొదలు, మొన్నటి తెలుగు నటుడు పొట్టి వీరయ్య దాకా చాలా మంది కన్నుమూశారు. తాజాగా మరో సీనియర్ నటుడు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ, తమిళ సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు కన్ను మూశారు. 'మేళా' రఘుగా ప్రాచుర్యం పొందిన పుథెన్వేలి శశిధరన్ మంగళవారం నాడు కొచ్చిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 60. చెర్తాలా నివాసి అయిన రఘు ఏప్రిల్ 16న హార్ట్ స్ట్రోక్ కారణంగా తన ఇంటి వద్ద కుప్పకూలిపోయాడు.
దీంతో ఆయన కుటుంబసభ్యులు ఆయన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. మంగళవారం ఉదయం నటుడి పరిస్థితి మరింత దిగజారింది. వృత్తిరీత్యా సర్కస్ విదూషకుడు అయిన రఘు 1980లో ప్రఖ్యాత చిత్ర నిర్మాత కె.జి. జార్జ్ దర్శకత్వం వహించిన 'మేళ' సినిమాలో నటించడంతో ఆయనకు అదే పేరు ఫిక్స్ అయిపోయింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు శ్రీనివాసన్ రఘులో ఉన్న నటుడిని కనుగొన్నారు. ప్రఖ్యాత భారత్ సర్కస్ ప్రదర్శించిన ప్రదర్శనలో విదూషకుడిగా రఘు నటనను చూసిన తరువాత అతనికి సినిమా అవకాశం ఇప్పించారు.

సర్కస్ కళాకారుల విషాద జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన 'మేళా'లో నటుడు మమ్ముట్టితో పాటు గోవిందన్కుట్టి అనే ప్రధాన పాత్రలో రఘు నటించారు. పుథెన్వేలి శశిధరన్ అని ఉన్న పేరును రేఘుగా మార్చాలని చిత్ర నిర్మాత జార్జ్ సూచించారు. సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు అతని పాత్ర జనానికి నచ్చడంతో ఆయనకు 'మేళా' రఘు అనే పేరు స్థిరపడిపోయింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ 1989లో చేసిన 'అపూర్వ సహోదరంగల్' లో నటించే అవకాశం సైతం రఘుకు లభించింది. ఇక నటుడు మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రిలీజ్ అయిన 'దృశ్యం 2' సినిమా రఘు చివరి చిత్రం.


Click it and Unblock the Notifications











