కప్పతల్లి పాటతో ఆకట్టుకున్న 'దొరసాని'.. ఆనాటి దృశ్యాలను కళ్లకు కట్టినట్లుగా
కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దొరసాని' చిత్రంలో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ల క్రిందటి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యశ్ రంగినేని, మధురా శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రానికి దగ్గుబాటి సురేశ్బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని 'దొరసాని' పై అంచనాలు పెంచేశాయి.
కాగా తాజాగా చిత్రంలోని కప్పతల్లి పాటను రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు. తెలంగాణా పదాలతో ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసేలా ఈ పాటలోని స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. పాపులర్ జానపద గీత రచయిత కం సింగర్ గోరేటి వెంకన్న అందించిన సాహిత్యం హైలైట్ గా నిలుస్తోంది. "షిటపట షిటపట షినుకుల తాళం నింగిని వంపిన సింగిడి బాణం..మత్తడి దునికిన పొంగుల హారం.. ఉరుముల మెరుపులా గుప్పెన కాలం కప్పల గంతుల పిల్లల మేళం" అంటూ హుషారుగా సాగిపోతున్న ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. పాటకు తగ్గట్టుగా ప్రశాంత్ ఆర్ విహారి ఇచ్చిన ట్యూన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ రోజుల్లో పల్లెల్లో జరిగే సంఘటనలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.

ఈ సినిమాతోనే 'దొరసాని' గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది జీవితరాజశేఖర్ కూతురు శివాత్మిక. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ఈ సినిమాలో జోడీ కట్టింది. అటు శివాత్మిక, ఇటు ఆనంద్ ఎవరకొండ ఇద్దరికీ ఇదే తొలి సినిమా కావడం విశేషం. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్డేట్స్ దొరసాని పై భారీ హైప్ క్రియేట్ చేశాయి.


Click it and Unblock the Notifications











