జూనియర్ పెళ్లి విందు..మెనూలో పచ్చళ్ళకు ప్రాధాన్యం
జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి విందు ఇవాళ సాయంత్రం ఏడుగంటలు నుంచి మాదాపూర్లోని హైటెక్స్లో ప్రారంభం కాబోతుంది. అచ్చమైన తెలుగు సంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ పెళ్ళిలో భోజనాలను బఫే పద్దతిలో కాకుండా బంతి భోజనాలను ఏర్పాటు చేశారు. వచ్చిన అతిధులకు భోజనాలు వడ్డించటానికి అవసరమైన సర్వర్స్ ఇప్పటికే వివాహ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక మెనూ చూస్తే...రాష్ట్రంలోని అన్నిప్రాంతాల అక్కడి ప్రాంతీయ అభిరుచులకు అనుగుణంగా దాదాపు యాభై ఐదు రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు.
పచ్చళ్లకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. రకరకాల పచ్చళ్లతో పాటు...నోరూరించే కర్రీలను తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దోసకాయ పచ్చడి, పనసపట్టు కర్రీ తయారు చేసే అవకాశం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట గ్రామానికి చెందిన ఉదయభాస్కర శర్మకు దక్కింది. ఈ వంటలు చేయడంలో శర్మకు మంచి పేరుంది. దీంతో ఈయన్ను వెతుక్కుంటూ మరీ ఆఫరొచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానంటున్నారు శర్మ. అతిధులందరికీ తన చేతి వంట రుచి చూపిస్తానని చెబుతున్నారు.
అనంతపురం జిల్లా సంప్రదాయ వంటకమైన ఓళిగను అతిధులకు అందించాలనుకుంటున్నారు అభిమానులు. పెళ్లికి హాజరయ్యే వారందరికీ సరిపోయేలా భారీ ఎత్తున ఓళిగలను తయారు చేయిస్తున్నారు. అతిధులందరూ తీపి ఓళిగలను తినాలని...తమ అభిమాన నటుడిని ఆశీర్వదించాలని కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











