Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్చరణ్ రాక : తోపులాట, లాఠీఛార్జి,గాయాలు
విజయవాడ: రామ్చరణ్తేజ నటించిన 'నాయక్' సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రాగా తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు లాఠీఛార్జి జరిపారు. ఇక్కడికి చేరుకున్న సినీ బృందానికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సాయంత్రం గం.4కు వచ్చిన వీరికి అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అంతకుముందు వారు బైకులతో ర్యాలీగా విమానాశ్రయానికి తరలివచ్చారు. రామ్చరణ్ బయటకు వచ్చే సమయంలో లాంజ్రూం ముందు తోపులాట జరిగింది. విమానాశ్రయ అధికారులు ఏర్పాటుచేసిన బారికేడ్లు విరిగిపోయాయి.
జెట్ ఎయిర్వేస్ విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు లాంజ్ గదిలోకి వెళుతున్న పలువురు ప్రయాణికులు సైతం ఈ తోపులాటలో చిక్కుకుని గాయాల పాలయ్యారు. గన్నవరం సి.ఐ. కృష్ణచైతన్య ఆద్వర్యంలో పోలీసులు యువకులపై లాఠీఛార్జి చేసి, వారిని చెదరగొట్టారు. భారీ భద్రత నడుమ చిత్ర బృందాన్ని బయటకు తరలించారు. కాన్వాయ్కు ముందు ర్యాలీగా వెళుతున్న యువకులు కేసరపల్లిలోని బుడమేరు వంతెన వద్ద ఆగిఉన్న ఆటోను ఢీకొట్టడంతో వెనుకనే వస్తున్న పలు బైకులు సైతం ఒకదానినొకటి ఢీకొట్టుకోగా పలువురు కిందపడిపోయారు. చిత్ర బృందానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు.
గవర్నర్ పేటలోనూ అదే పరిస్ధితి ఎదురైంది. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో అనుసరించిన వాహనాల శ్రేణి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు తోడ్కోని వచ్చింది. స్టేడియం పరిసరాలు అభిమానులతో కిక్కిరిశాయి. అభిమానుల ఒత్తిడి చేయటంతో రామ్చరణ్ ఓపెన్టాప్ జీపు ఎక్కారు. వెంటనే ఆయనపై పూలజల్లు కురిపించారు. 'నాయక్ సినిమా చూశారా...? ఎలా ఉందంటూ..?' ఆయన సైగలతో అందరినీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రామ్చరణ్కు అమ్మవారి చిత్రపటం బహూకరించారు. గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు.
అనంతరం ప్రదర్శనగా రాజ్యువరాజ్ థియేటర్కు బయలుదేరారు. దారిపొడవునా అభిమానులు కిక్కిరిసి ఉండడంతో నిర్దిష్ట సమయానికన్నా ఆలస్యంగా చరణ్ థియేటరు వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ భారీయెత్తున యువత, మహిళలు, జనం తరిలిరావడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అయినా జనాన్ని నియంత్రించలేక చేతులెత్తేశారు. దీంతో రామ్చరణ్, దర్శకుడు వి.వి.వినాయక్లు తియేటరులోకి వెళ్లకుండానే అభిమానులకు అభివాదం చేసి వెనుదిరిగారు. దీంతో సినిమా హాలులోని ప్రేక్షకులు నిరుత్సాహానికి లోనయ్యారు. ఈ యాత్రలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, కృష్ణా జిల్లా పంపిణీదారులు అలంకార్ ప్రసాద్, ఫిలిం ఛాంబర్ మాజీ కార్యదర్శి ముత్యాల రమేష్, రాఘవేంద్ర థియేటరు నిర్వాహకుడు కుమార్, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు శ్యామ్ప్రసాద్, కృష్ణప్రసాద్, పోతిన వాసు, ఆనంద్ పాల్గొన్నారు.