సీనియర్ నటుడు జె.వి.రమణమూర్తి కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ నటుడు జె.వి రమణమూర్తి మృతి చెందారు. అలనాటి చిత్రాల్లో హీరోగా, ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ నటుడిగా మరపురాని పాత్రలు పోషించిన జె.వి. రమణమూర్తి (83) ఇకలేరు. హైదరాబాద్లో బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.
హైదరాబాద్ అమీర్పేటలో నివాసముండే ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
శ్రీకాకుళం జిల్లాలోని లుకులాం అగ్రహారంలో 1933లో జన్మించిన జొన్నలగడ్డ వెంకట రమణమూర్తికి భార్య, కుమార్తెలు శారద, నటన, కుమారులు అరుణ్కుమార్, హర్షవర్ధన్ ఉన్నారు.

ప్రముఖ నటులు జె.వి.సోమయాజులు సోదరుడైన రమణమూర్తి 1957లో 'ఎమ్మెల్యే' చిత్రంతో తెరంగేట్రం చేశారు. 150పై చిలుకు చిత్రాల్లో నటించారు.హీరోగా, సహనటుడిగా ప్రేక్షకుల్ని అలరించారు. చివరిగా ఆయన 'ఆర్య', 'శంకర్ దాదా జిందాబాద్', 'తుమ్మెద'లాంటి చిత్రాల్లో నటించారు.
గురజాడ అప్పారావు రాసిన 'కన్యాశుల్కం' నాటకం ద్వారా ప్రఖ్యాతి పొందారు. నాలుగు దశాబ్దాల కాలంలో వెయ్యిసార్లకిపైగా కన్యాశుల్కంలోని గిరీశం పాత్రని పోషిస్తూ 'అపర గిరీశం'గా పేరు పొందారు.
'మాంగల్యబలం', 'బాటసారి', 'దొంగల దోపిడి', 'కటకటాల రుద్రయ్య', 'మరో చరిత్ర', 'సిరిసిరిమువ్వ', 'గోరింటాకు', 'గుప్పెడు మనసు', 'ఇది కథ కాదు', 'శుభోదయం', 'ఆకలిరాజ్యం', 'గడసరి అత్త సొగసరి కోడలు', 'సప్తపది', 'శుభలేఖ', 'ఆంధ్రకేసరి', 'సిరివెన్నెల, 'ఆకలిరాజ్యం', 'కర్తవ్యం' వంటి ఎన్నో చిత్రాలలో రమణమూర్తి నటించి,పాత్రలకు ప్రాణం పోషారు. తెలుగుతోపాటు, తమిళంలోనూ నటించి ప్రేక్షకుల్ని అలరించారు.


Click it and Unblock the Notifications











