గాంధీజీలా నడుస్తున్నానంటూ కమల్ ..
చెన్నై: ఇటీవల ప్రముఖ నటుడు కమల్ హాసన్ కాలుజారి గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కాలికి సర్జరీ చేశారు. రెండు రోజుల క్రితం నొప్పి అధికమవడంతో మళ్లీ చిన్నపాటి సర్జరీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి ఆయన లేచి మెల్లమెల్లగా నడుస్తున్నారు. ఈ విషయమై తాను నడవగలుగుతున్నానని నటుడు కమల్హాసన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
కమల్ స్పందిస్తూ.. అభిమానులకు, స్నేహితులకు ఓ మంచి విషయం చెప్పదలచుకున్నానని అన్నారు. ప్రస్తుతం లేచి నడుస్తున్నానని తెలిపారు. గాంధీజీ మాదిరిగా ఇద్దరి సహాయంతో నడుస్తున్నప్పటికీ గతంతో పోలిస్తే ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు.
మరో పదిరోజుల్లో కమల్ డిశ్చార్జి అయ్యే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు కమల్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు కూడా ప్రార్థనలు చేస్తున్నారు. కమల్ చేసిన ట్వీటుకు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కమల్ తాజా చిత్రం శభాష్ నాయుడు విషయానికి వస్తే... సినిమాను ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ స్టార్ట్ చేసినప్పటి నుంచీ అదేపనిగా బ్రేకులు పడుతున్నాయి. ఆ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెడితే... డైరెక్టర్ రాజీవ్ కుమార్ హఠాత్తుగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరాడు. ఆయన ఇప్పటికీ కోలుకోలేదు.

తన సినిమా డైరెక్టర్ మంచాన పడడంతో కమల్ హాసన్ తనే స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. అయితే...కమల్ రీసెంట్ గా తన ఆఫీస్ లోనే జారిపడడంతో కాలికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నెలరోజులు రెస్ట్ తీసుకోవాలట.
ఇలా ఉండగా ఎడిటర్ జేమ్స్ జోసఫ్ భార్యకు యాక్సిడెంట్ కావడంతో అతను వెంటనే అమెరికా నుంచి ఇండియా వచ్చాడు. ఇక కెమెరామేన్ జయకృష్ణ చేసే వర్క్ నచ్చనందున మరొకరిని తీసుకోవచ్చని చెబుతున్నారు. శభాష్ నాయుడు ఇలా వరసగా అవాంతరాల్ని ఎదుర్కొంటున్నాడు. ఈ ఆటంకాల నుంచి బయటపడి ఆ మూవీ ఎప్పుడు బయటపడేదీ ఎవరూ చెప్పలేకపోతున్నారు.


Click it and Unblock the Notifications











